Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : గవర్నర్ బిల్లులను పెండింగ్ పెట్టడంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో సోమవారం మరోసారి విచారణ జరిగింది. గవర్నర్ తరఫున సొలిటర్ జనరల్ వాదనలు వినిపించారు. ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్లో ఎలాంటి బిల్లులు లేవని, కొన్ని బిల్లులను తిప్పి పంపారంటూ తెలిపారు. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ప్రజలచే ఎన్నికల ప్రభుత్వం గవర్నర్ దయకోసం చూడాల్సి వస్తోందన్నారు. ఇరువైపులా వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం బిల్లులను వీలైనంత త్వరగా క్లియర్ చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం పెండింగ్లో బిల్లులు లేనందున కేసును ముగిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. గతేడాది అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించిన బిల్లులను గవర్నర్ పెండింగ్లో పెట్టారంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విషయంలో కేంద్రం స్పందన కోరిన సుప్రీంకోర్టు.. గవర్నర్కు నోటీసులు జారీ చేస్తామని చెప్పింది. అయితే, సమస్య ఏంటో తెలుసుకుంటామని ఎస్జీ తుషార్ మెహత కోర్టుకు తెలిపారు. ఈ అంశంపై మరోసారి విచారణ జరగ్గా.. ఈ నెల 9న గవర్నర్ కార్యాలయం నుంచి ఓ నివేదిక కోర్టుకు అందిందని, దాన్ని సీజేఐ రికార్డు చేసినట్లు పేర్కొన్నారు. మూడు బిల్లులకు ఆమోదం తెలిపారని, కొన్ని బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ వివరణ కోరారని.. అదే విషయాన్ని గవర్నర్ కార్యాలయం నివేదికలో పేర్కొన్నట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఆ తర్వాత ధర్మాసనం పెండింగ్ బిల్లుల విషయంపై విచారణను వాయిదా వేసింది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి విచారణ జరిగింది. బిల్లులను ఎప్పటికప్పుడు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశిస్తూ.. కేసును ముగిస్తున్నట్లు పేర్కొంది.