Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ గమనించాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇప్పటికీ ప్రజలకు సాగు, తాగునీరు సరిగా అందడం లేదని చెప్పారు. నీరు అందించని పాపం ఎవరిదని ఆయన ప్రశ్నించారు. మహారాష్ట్రలోని జబిందా మైదానంలో ఏర్పాటు చేసిన భారాస బహిరంగ సభకు కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మరాఠా నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భారాస మహారాష్ట్రలో బహిరంగ సభ నిర్వహించడం ఇది మూడోసారి. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణా వంటి నదులున్నా.. మహారాష్ట్రకు నీటి సమస్య ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. 'ముంబయి దేశ ఆర్థిక రాజధాని.. కానీ, తాగేందుకు నీళ్లుండవా? దేశం పురోగమిస్తోందా.. తిరోగమిస్తోందా? ఆలోచించండి. ఔరంగాబాద్, అకోలాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. దేశంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. పేదలు మరింత నిరుపేదలుగా మారుతున్నారు. ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారు. ఇదంతా మన కళ్లముందే జరుగుతోంది. ఇది ఇలాగే జరగాలా.. చికిత్స చేయాలా.. చెప్పండి. నా మాటలు విని ఇక్కడే మర్చిపోకండి. నా మాటలపై మీ గ్రామాలకు వెళ్లి చర్చ చేయండి. మీ ఇంటివాళ్లు, స్నేహితులు వీధిలో ఉన్నవారందరితో చర్చించాలి' అని కేసీఆర్ పిలుపునిచ్చారు.