Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు రాష్ట్రవ్యాప్తంగా మినీ ప్లీనరీలు నిర్వహించేందుకు భారత రాష్ట్ర సమితి సిద్ధమైంది. తొలిసారి అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో పార్టీ ప్రతినిధుల సభలను నిర్వహిస్తోంది. ప్రతీ నియోజకవర్గంలో సుమారు మూడున్నర వేల మంది ప్రతినిధులతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల మంది నేటి సభల్లో పాల్గొననున్నారు. స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు, మేయర్లు, ఛైర్మన్లు తదితర ముఖ్య నేతలు సహా దాదాపు మూడు వేలకు పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు. ఉదయమే నగరం, పట్టణం, గ్రామమంతటా పార్టీ జెండాలను ఎగురవేయనున్నారు. పది గంటలకల్లా నాయకులు, కార్యకర్తలు సభ ప్రాంగణానికి చేరుకుంటారు. ఉద్యమ కాలం నుంచి రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొమ్మిదేళ్లలో సాధించిన అభివృద్ధి, సంక్షేమంపై సభల్లో లోతుగా చర్చిస్తారు. ఈ సందర్భంగా ప్రతినిధుల సభలో కనీసం ఆరు అంశాలపై తీర్మానాలు చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.