Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-విశాఖపట్నం: విశాఖ ఆర్కే బీచ్లో మంగళవారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిన వివాహిత శ్వేత (24) కేసులో మిస్టరీ వీడింది. శ్వేత మృతిని ఆత్మహత్యగా భావించినప్పటికీ, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చారు. శ్వేత ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పటి నుంచి.. ఆర్కే బీచ్లో శవమై కనిపించినప్పటి వరకు చోటు చేసుకున్న పరిణామాలను విశాఖ సీపీ త్రివిక్రమ్ వర్మ మీడియాకు వివరించారు.
శ్రీకాకుళం జిల్లా మూలపేటకు చెందిన శ్వేతకు ఏడాది క్రితం గాజువాక సమీపంలోని ఉక్కు నిర్వాసితకాలనీకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ గురుమిల్ల మణికంఠతో వివాహం అయింది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. పదిహేను రోజుల క్రితం కార్యాలయ పనిపై మణికంఠ హైదరాబాద్ వెళ్లారు. అత్తమామలతో కలిసి ఉంటున్న శ్వేత మంగళవారం సాయంత్రం అత్తతో గొడవ జరిగింది. ఆ తర్వాత రాత్రి 8.20 నుంచి 8.32 వరకు భర్తతో భర్తతో ఫోన్లో మాట్లాడింది. అనంతరం సూసైడ్ నోట్ను గదిలో పెట్టి ఇంటి నుంచి వెళ్లి పోయింది. శ్వేత పేరుపై కోట బొమ్మాళిలో ఉన్న 90 శెంట్ల భూమి.. తన పేరుపై రాయాలని భర్త మణికంఠ ఎప్పటి నుంచో ఒత్తిడి చేస్తున్నాడు. శ్వేత గర్భవతి అయిన తర్వాత పుట్టింటికి వెళ్లినప్పుడు తల్లి ఎదుటే భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డారు. తన తల్లి ఎదుటే మణికంఠ శ్వేతపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. అప్పుడే ఆత్మహత్యకు ప్రయత్నించగా తల్లి కాపాడింది. అప్పటి నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. శ్వేత ఆడపడుచులిద్దరూ వారి ఇంటికి సమీపంలోనే ఉంటారు. వారు తరచూ ఇంటికి వచ్చి భర్త లేని సమయంలో శ్వేతను వేధిస్తుండే వారు. ఇటీవల జరిగిన పరిణామాలు, సూసైడ్ నోట్ ఆధారంగా శ్వేతది ఆత్మహత్యేనని భావిస్తున్నాం. శ్వేత శరీరంపై కూడా ఎలాంటి గాయాలు లేవని పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైంది అని సీపీ వెల్లడించారు