Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సికింద్రాబాద్ బేగంపేట్ సర్కిల్ పరిధిలోని కలాసిగూడ నాలాలో పడి ప్రాణాలు కోల్పోయిన బాలిక కుటుంబాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. ఈ ఘటన అత్యంత బాధాకరమన్నారు. ఉదయాన్నే పాల ప్యాకెట్ తీసుకురావడానికి వెళ్తుండగా కింద పడిన తన సోదరుడిని కాపాడే ప్రయత్నంలో చిన్నారి నాలాలో పడిపోయినట్లు చెప్పారు. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఒక అమ్మాయి చనిపోవడం ఎంతగానో కలచివేసిందన్నారు. బాలిక కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల పరిహారాన్ని అందిస్తామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీహెచ్ఎంసీ పరిధిలో రూ.590 కోట్లతో వివిధ కార్యక్రమాలను చేపడుతున్నాం. భారీ వర్షాలు పడితే ఎక్కడెక్కడ వరద వస్తుందో.. అలాంటి నాలాలను ఈ నిధులతో బాగు చేస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ హయాంలో జరిగిన పాపాలను ఈ ప్రభుత్వం మోయాల్సిన పరిస్థితి నెలకొంది. నాలాలపై చేపట్టిన నిర్మాణాల వల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. రూ.10 కోట్లు ఖర్చు పెట్టి కలాసీగూడ నాలాకు మరమ్మతులు చేశారు. గతంలోనూ వరదలు వచ్చినప్పుడు ఇంటింటికీ రూ.10వేల చొప్పున రూ.650 కోట్లను పరిహారంగా అందించాం.