Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
2005లో బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ కిడ్నాప్, మర్డర్ కేసులో గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీకి పదేళ్ల జైలుశిక్ష పడిన విషయం తెలిసిందే. ఈ శిక్షను ఘాజిపూర్ కోర్టు ఖరారు చేసింది. 5 లక్షల జరిమానా కూడా చెల్లించాలని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ముక్తార్ అన్సారీతో పాటు ఆయన సోదరుడు బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీని కూడా దోషిగా తేల్చిన కోర్టు.. ఆయనకు నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. దీంతోపాటు రూ. లక్ష జరిమానా విధించింది.
అఫ్జల్ అన్సారీ ప్రస్తుతం ఘాజీపూర్ ఎంపీగా ఉన్నారు. కోర్టు తీర్పుతో ఆయన తన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోనున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8లోని ఆర్టికల్ 102(1)(ఈ) నిబంధన ప్రకారం రెండేండ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలుశిక్ష పడిన వ్యక్తి తీర్పు వెలువడిన తేదీ నుంచి రాజ్యాంగ పదవుల్లో ఉండటానికి అర్హత కోల్పోతారు. జైలు శిక్షాకాలంతోపాటు మరో ఆరేండ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకూ అనర్హులవుతారు. సెక్షన్ 8లో పేర్కొన్న నేరాలకు ఈ అనర్హత వేటు వర్తిస్తుంది. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2019 పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నిబంధలన ప్రకారం.. లోక్సభ సెక్రటేరియట్ రాహుల్పై అనర్హత వేటు వేసింది. దీంతో ఆయన తన ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది.