Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వరంగల్: అర్ధరాత్రి ఆటో ఆపిన పాపానికి మహిళపై ముగ్గురు ఆటో డ్రైవర్లు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. హనుమకొండ పోలీసు ఠాణా పరిధిలో జరిగిన ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. శనివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ నయీంనగర్ సమీపంలో నివసిస్తున్న వివాహిత ఏప్రిల్ 27న పనిమీద బయటకు వెళ్లి రాత్రి 12 గంటల సమయంలో ఇంటికి తిరిగి వస్తున్నారు. అర్ధరాత్రి కావడంతో కేయూ క్రాస్ వద్ద రోడ్డుపై వెళుతున్న ఆటోను ఆపి తనను రంగ్బార్ వద్ద దింపాలని డ్రైవర్ను కోరారు. మహిళను ఆటో ఎక్కించుకున్న డ్రైవర్ రాకేశ్.. తన స్నేహితులైన ఆటో డ్రైవర్లు సనత్, సతీష్కు ఫోన్ చేయగానే కొద్దిసేపటికే వాళ్లు వచ్చి ఆటో ఎక్కారు. ఆటోను మహిళ చెప్పిన చోటకు కాకుండా భీమారం వైపు తీసుకెళ్లారు. దీంతో తనను ఎటు తీసుకెళ్తున్నారంటూ ఆమె అరవడం ప్రారంభించారు. రాకేశ్ స్నేహితులు ఆమెను అరవొద్దంటూ బెదిరించారు. భీమారం గ్రామ శివారులోకి వెళ్లిన తర్వాత ఆటో సౌండ్ బాక్స్ శబ్దం బాగా పెంచి ఆటోలో ఒకరి తర్వాత ఒకరు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. తర్వాత రంగ్బార్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన మహిళ బంధువులకు విషయం తెలపడంతో వారు హనుమకొండ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదుచేశారు. పోలీసులు కేసు నమోదు చేసి మహిళకు వైద్య పరీక్షలు చేయించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు హనుమకొండ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్జీ చెప్పారు.