Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
అప్పుడే పుట్టిన బిడ్డకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు కీసర 108 సిబ్బంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకున్నది. కీసర మండలం కుందన్పల్లికి చెందిన ఆర్తికుమారికి శనివారం అర్ధరాత్రి దాటాక 2 గంటల ప్రాంతంలో పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆమెను కుటుంబసభ్యులు కీసరలోని ఓ ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు నెలలు నిండలేదని, ఆపరేషన్ చేయాలని, పుట్టబోయే బిడ్డ ఎదుగుదల సరిగ్గా లేదని, బిడ్డను ఐసీయూలో పెట్టాల్సి వస్తుందని, అధిక ఖర్చు అవుతుందని సూచించారు. కోళ్లఫారంలో పనిచేస్తున్న తమ దగ్గర అంత డబ్బు లేదని చెప్పడంతో వైద్యులు గాంధీ దవాఖానకు తీసుకెళ్లాలని సూచించారు. ఆర్తి కుటుంబసభ్యులు 108కు సమాచారం ఇచ్చారు.
ఆమెను 108 అంబులెన్స్లోకి తీసుకొని ఈఎమ్టీ చిత్రం రవి ఆమెకు గ్లూకోజ్ ఎక్కిస్తూ గాంధీ దవాఖానకు తరలించారు. మార్గమధ్యలో నాగారం సమీపంలోకి రాగానే పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. వైద్యాధికారుల సూచనల మేరకు రవి ఆమెకు అంబులెన్స్లోనే ప్రసవం చేశారు. నెలలు నిండక, తక్కువ వెయిట్, బ్రీతింగ్, హార్ట్బీట్ కూడా లేకుండా మగబిడ్డ తల్లి గర్భం నుంచి బయటికి కొచ్చింది. ఈ విషయాన్ని రవి ఉన్నతాధికారులకు వివరించి వారి సూచనలతో బిడ్డకు సీపీఆర్ చేస్తూ అంబూబ్యాగ్తో బ్రీతింగ్ అందిస్తూ, ఆక్సిజన్ సరఫరా చేస్తూ గాంధీ దవాఖానకు చేరుకొన్నారు. సరైన సమయంలో సీపీఆర్ చేసి పసిబిడ్డ ప్రాణాలు కాపాడారని 108 సిబ్బందిని గాంధీ వైద్యులు అభినందించారు. ఆర్తి కుటుంబీకులు సిబ్బందిని గుండెలకు హత్తుకొని కృతజ్ఞతలు తెలిపారు.