Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ: ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరుగుతున్నది. ఇప్పటికే బీఆర్ఎస్ భవన్లో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, ఎంపీ వెంకటేశ్ నేత పూజలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 1.05 గంటలకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆఫీసును ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఇప్పటికే దేశ రాజధానికి చేరుకున్నారు.
ఢిల్లీ వసంత్ విహార్లో బీఆర్ఎస్ ఆఫీసు నిర్మాణానికి 2021, సెప్టెంబర్ 2న సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. మొత్తం నాలుగు అంతస్థులతో 11 వేల చదరపు అడుగుల స్థలంలో దీనిని నిర్మించారు. లోయర్గ్రౌండ్లో మీడియా హాల్, సర్వెంట్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇక గ్రౌండ్ఫ్లోర్లో క్యాంటీన్, రిసెప్షన్ లాబీ, 4 ప్రధాన కార్యదర్శుల చాంబర్లు, మొదటి అంతస్థులో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ చాంబర్, ఇతర చాంబర్స్, కాన్ఫరెన్స్ హాల్స్, 2వ, 3వ అంతస్థుల్లో మొత్తం 20 గదులు ఉన్నాయి. వీటిలో పార్టీ ప్రెసిడెంట్ సూట్, వర్కింగ్ ప్రెసిడెంట్ సూట్పోగా మిగతా 18 ఇతర రూములు అందుబాటులో ఉంటాయి.