Authorization
Mon March 03, 2025 01:01:28 am
నవతెలంగాణ - ఏలూరు: విద్యను ముగించుకొని ఇంటికి వెళ్ళబోతున్న విద్యార్థులకు నూజివీడు ట్రిపుల్ ఐటీ అధికారులు షాకిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నూజివీడు, శ్రీకాకుళం, ఇడుపులపాయ, ఒంగోలు క్యాంపస్లలో ఆఖరి ఏడాది పూర్తి చేసుకున్న నాలుగు వేల మంది విద్యార్థులకు ఫీజులు చెల్లించని కారణంగా ఆర్జీయూకేటీ ధ్రువపత్రాలను నిలిపివేసింది. దీంతో పేద విద్యార్థులు కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజుల మొత్తాన్ని గడువు మేరకు ఎప్పటికప్పుడు తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నామని సీఎం జగన్ చెబుతున్న గొప్పల్లో డొల్లతనం బయటపడినట్లైంది. నూజివీడు ట్రిపుల్ ఐటీలో బీటెక్ ఆఖరి సంవత్సర విద్యార్థులు పూర్తి బకాయిలను ఈరోజు సాయంత్రంలోగా చెల్లించకపోతే బయటకు అనుమతి లేదని, అల్పాహారం, వసతి కట్ చేయాలని, ధ్రువపత్రాలు ఇవ్వవద్దంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఇంటర్నషిప్తో ప్లేస్మెంట్ సాధించిన విద్యార్థులు ఆయా కంపెనీల్లో హాజరుకాల్సి ఉండగా.. అధికారుల ఉత్తర్వులతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. చదువు పూర్తయినప్పటికీ విద్యాదీవెన అందకపోవడంతో విద్యార్థులకు కళాశాలల యాజమాన్యం ధ్రువపత్రాలు నిలిపివేయడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. బీటెక్ నాలుగో ఏడాది విద్యార్థులకు విద్యా సంవత్సరం ముగిసిపోయినా ప్రభుత్వం ఒక్క త్రైమాసికం ఫీజునే చెల్లించగా.. మూడు విడతల ఫీజులు పెండింగ్లో ఉన్నాయి. ఫీజులు తల్లుల ఖాతాల్లో జమ అవుతున్నందున తమకు సంభందం లేదని, కట్టాల్సిందేనని విద్యార్థులపై ట్రిపుల్ ఐటీ అధికారులు ఒత్తిడి చేస్తున్న పరిస్థితి. ఉన్నత విద్యా మండలి ఇచ్చిన ఉమ్మడి అకాడమీక్ కేలండర్ ప్రకారం ఏప్రిల్ 24తో నాలుగో ఏడాది వారికి విద్యా సంవత్సరం ముగిసింది. కానీ ప్రభుత్వం మాత్రం ఫీజులు చెల్లించకపోగా... అక్టోబర్ నెలను ప్రామాణికంగా తీసుకుని వింత లెక్కలు వేస్తున్న వైనం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.