Authorization
Mon April 07, 2025 08:38:06 pm
నవతెలంగాణ-హైదరాబాద్: బేగంపేటలోని ధనియాలగుట్టలో వైకుంఠ ధామాన్ని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా, మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, అమెరికాలో కూడా సమస్యలు ఉంటాయని అన్నారు. ప్రజలు ఉన్నంత వరకు సమస్యలు ఉంటాయని వివరించారు. నగరాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రజలకు హామీ ఇచ్చారు. నిర్మాణాన్ని ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ అధునాతన సౌకర్యాన్ని నిర్మించామని ఆయన తెలిపారు.
బాగా అభివృద్ధి చెందిన నగరంలో ఫ్లై ఓవర్లు, మెరుగైన రవాణా వ్యవస్థతోపాటు మంచినీటి సరఫరా, 24 గంటల కరెంటు ఉండాలని కేటీఆర్ పేర్కొన్నారు. తన తొమ్మిదేళ్ల పాలనలో హైదరాబాద్కు గర్వకారణంగా నిలిచామన్నారు. హైదరాబాద్ నగరం న్యూయార్క్ను తలపించేలా రూపాంతరం చెందిందని రజనీకాంత్, లయ చేసిన వ్యాఖ్యలను కూడా మంత్రి ప్రస్తావించారు. హైదరాబాద్లో సమస్యలు ఉన్నాయని, అయితే వాటిని పరిష్కరించి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. అంతిమంగా మంచి నాయకులు, ప్రభుత్వాలను ఆదరించి కేసీఆర్ ను ముచ్చటగా మూడోసారి గెలిపించాలని, అది నగర, రాష్ట్ర అభివృద్ధిలో కీలకమని కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.