Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే, బీజేపీ ఓటమిపై తన అభిప్రాయాన్ని వెల్లడించని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఎట్టకేలకు స్పందించారు. కాంగ్రెస్ మోసం చేసి విజయం సాధించిందని ఆయన అన్నారు. ప్రజలకు మోస పూరిత హామీలిచ్చిందని, ఈ విషయం అతి త్వరలోనే తెలుస్తుందని ఆయన అన్నారు. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలం అవుతాయని, భవిష్యత్తులో కాంగ్రెస్ తో తమ పోరు మరింత సులభం అవుతుందని చెప్పారు. నేపాల్ లోని జనక్ పూర్ లో పర్యటించిన ఆయన, తిరుగు ప్రయాణంలో పట్నాలోని మహావీర్ దేవాలయాన్ని సందర్శించిన తరువాత, మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రాల్లో సీఎంలను ఎంపిక చేసుకోవడమే కాంగ్రెస్ ముందున్న అతి పెద్ద సవాలుగా మారనుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, ఏది ఎదురైనా హుందాగా స్వీకరిస్తామని ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. ఓడిపోతే ఈవీఎంలపై నిందలు వేసే పార్టీ తమది కాదని చెప్పారు.