Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న పోలింగ్ బూత్లో ఆశ్చర్యకరమైన ఓటు శాతం నమోదైంది. హిమాచల్ ప్రదేశ్లో సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తులోని తాషిగనగ్ గ్రామంలో ఈ పోలింగ్ కేంద్రం ఉంది. అయితే, పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల్లోపే ఈ కేంద్రంలో 53 శాతం నమోదవడం రికార్డు సృష్టించింది. ఈ వివరాలు రాష్ట్ర ఎన్నికల అధికారులు వెల్లడించారు.
ఆ బూత్ పరిధిలో కేవలం 49 మంది మాత్రమే ఓటర్లు ఉన్నారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. ఆ సమయంలో ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల్లో ఉంది. ఇంత చలిలో కూడా స్వెటర్లు ధరించి, రగ్గులు కప్పుకొని ఓటు హక్కు వినియోగించుకొనేందుకు స్థానికులు వచ్చారని ఎన్నికల అధికారి హర్భజన్లాల్ ధీమన్ తెలిపారు.
తక్కువ మంది ఓటర్లున్న కేంద్రం ఇదే..
'కా' అనే పోలింగ్ స్టేషన్ దేశంలోనే అత్యంత తక్కువ ఓటర్లున్న ప్రాంతంగా రికార్డు నెలకొల్పిందని హర్భజన్ లాల్ వెల్లడించారు. ఈ పోలింగ్ కేంద్రం పరిధిలో కేవలం 16 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఈ రెండు పోలింగ్ కేంద్రాలు మండి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాయి. ఇక్కడి నుంచి 17 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్, భాజపా మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. హిమాచల్ ప్రదేశ్లో ఉన్న నాలుగు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 53,30,154 మంది ఓటర్లున్నారు.