Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సదువులో ఆర్థిక, సామాజిక అంతరాలు
- డిజిటల్ పాఠాలను ప్రారంభించాలి
- 'విద్యారంగంపై కోవిడ్ ప్రభావం' వెబినార్లో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విద్యా ఉద్యమాన్ని ప్రజాపోరాటంగా మార్చాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ, ఎమ్వీఎఫ్ నేషనల్ కన్వీనర్ ఆర్. వెంకట్రెడ్డి, టీపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి మైసా శ్రీనివాస్ నొక్కి చెప్పారు. కోవిడ్ నేపథ్యంలో విద్యా వ్యవస్థను నడిపించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిర్ధిష్ట ప్రణాళికల్లేవని విమర్శించారు. ఆన్లైన్ విద్య పిల్లలకు అంతగా ఉపయోగపడదనీ, వీలైనంత మేర ఆప్లైన్ విద్య మంచిదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ పాఠాలను ప్రారంభించాలని సూచించారు. తెలంగాణ వామపక్షాలు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల వేదిక ఆధ్వర్యంలో విద్యారంగంపై కోవిడ్ ప్రభావం అనే అంశంపై సీపీఐ(ఎం) సోషల్మీడియా విభాగం ఇన్ఛార్జి జగదీశ్ అధ్యక్షతన వెబినార్ను శుక్రవారం నిర్వహించారు.
ఎమ్మెల్సీ ఎ. నర్సిరెడ్డి మాట్లాడుతూ..విద్యా, వైద్య రంగాలు ప్రభుత్వ రంగంలో ఉంటేనే సమాజ మనుగడ సాగుతుందన్నారు. కరోనా విపత్తు ప్రపంచానికి చాటిచెప్పిందన్నారు. సామాజిక మాద్యమాల వేదికపై ప్రజల నుంచీ ఈ డిమాండ్ బలంగా వినిపిస్తున్నదన్నారు. ప్రజల కోరిక ఇలా ఉంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం బొగ్గుగనులను, విమానయానం, అంతరిక్షయానాన్ని ప్రయివేటీకరించే చర్యలకు పూనుకున్నదని విమర్శించారు. నూతన విద్యా విధానం పేరుతో విద్యారంగాన్నీ కార్పోరేట్లకు కట్టబెట్టుడుతున్నదన్నారు. కరోనా సామాజిక, ఆర్థిక రంగాల్లోనే కాదు విద్యారంగంలోనూ ప్రజల మధ్య అంతరాలను సృష్టించిందన్నారు. నూటికి 85 శాతం మంది నేడు విద్యకు నోచుకోలేకపోతున్నారనీ, కేవలం 15 శాతం మందే ఆన్లైన్ ద్వారా పాఠాలను అభ్యసిస్తున్నారని తెలిపారు. వారు కూడా మొక్కుబడి పాఠాలు వింటున్న పరిస్థితి ఉందని వాపోయారు. విద్యావ్యవస్థ పూర్తిగా దెబ్బతినకుండా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మధ్య వివిధ వేదికల ద్వారా అనుబంధం పెరగాలన్నారు. గుజరాత్లో 14 ఛానళ్ల ద్వారా పాఠాలు చెప్పే వెసులుబాటు కల్పించారనీ, తెలంగాణలో ఎందుకు కల్పించరని పీఎం మోడీని సీఎం కేసీఆర్ ఎందుకు ప్రశ్నించరని ప్రశ్నించారు. సప్తగిరి, టీశాట్లోని నాలుగు ఛానళ్లు తదితర ఛానళ్ల ద్వారా విద్యార్థులకు పాఠాలు వినిపించాలన్నారు. ప్రయివేటు విద్యాసంస్థలపై నియంత్రణ ఉండాలనీ, ఫీజుల దోపిడీపైనా రాష్ట్ర సర్కారు దృష్టి సారించాలన్నారు. కేరళలో వామపక్ష ప్రభుత్వం ఫస్ట్ బెల్ పేరుతో పాఠశాలను ప్రారంభించిందనీ, రాష్ట్ర ప్రభుత్వమూ ప్రత్యేక చొరవతో ముందుకు రావాలని కోరారు.
హెచ్సీయూ ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ...రాష్ట్రంలో 98 శాతం మంది ప్రజలకు నెట్ సౌకర్యం లేదనీ, ఎస్సీ,ఎస్టీ సామాజిక తరగతుల్లో 88 శాతం మందికి ఆన్డ్రాయిడ్ ఫోన్లు లేవన్నారు. వారి పిల్లలకు ఆన్లైన్ విద్య ఎలా అందుతుందని ప్రశ్నించారు. కేంద్రం చెబుతున్న అంకెల జ్ఞానం, అక్షర జ్ఞానం మాత్రమే సరిపోదన్నారు. సమాజ పురోగాభివృద్ధికి తోడ్పడేలా విద్యావిధానం ఉండాలన్నారు. 900కిపైగా డిజిటల్ పాఠాలు సిద్ధంగా ఉన్నాయనీ, వర్క్షీట్లు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. ఇక్కడ చేయాల్సిందల్లా ప్రభుత్వం ఒకడుగు ముందుకు వేసి విద్యావ్యవస్థను డ్రైవర్ పాత్రలో గాడిలో పెట్టాలని సూచించారు. టీవీలు, సెల్లు, ల్యాప్ట్యాప్లు లేని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం వాటిని కొనివ్వాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు.
మైసా శ్రీనివాస్ మాట్లాడుతూ...ఆన్లైన్ విద్య నిర్జీవ ప్రక్రియ అనీ, అది సహేతుకం కాదన్నారు. టీచర్ నేరుగా చెబితే పిల్లలకు మంచిదని స్పష్టం చేశారు. కేంద్రం విద్యారంగాన్ని క్రమంగా నిర్వీర్యం చేస్తున్నదనీ, పది శాతం నిధులను ఆరు శాతానికి తగ్గించడమే దీనిని ఉదాహరణ అని చెప్పారు. ప్రజాస్వామ్య, లౌకిక విలువలను పెంచిపోషించేలా విద్య ఉండాలన్నారు. విద్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ పనితీరు మెరుగుపడాలనీ, విద్యాసంవత్సరం దెబ్బతినకుండా ప్రణాళిక ఉండాలనీ కోరారు. వెంకట్రెడ్డి మాట్లాడుతూ...కరోనా కాలంలో రాష్ట్రం, జిల్లాలు, మండలాల వారీగా విభజన చేపట్టి విద్యను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ప్రతి పాఠశాలనూ శానిటైజేషన్ చేయాలనీ, విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు టారులెట్లు, తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని కేరళ, బీహార్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో మాదిరిగా తెలంగాణలోనూ అమలు చేయాలని విన్నవించారు. వర్క్షీట్లను పిల్లలకు అందించాలని కోరారు.