Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-టీఆర్ టీడబ్ల్యూయూనియన్ల ఆందోళన
- తీవ్ర ఉద్రిక్తత.. కమిషనర్కు వినతిపత్రం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
లాక్డౌన్ నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రవాణారంగ కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుతూ తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ల జేఏసీ డిమాండ్ చేసింది. ఈమేరకు శుక్రవారం ఖైరతాబాద్ రవాణాశాఖ ప్రధాన కార్యాలయం ధర్నా నిర్వహించారు. దీంతో ఆర్టీఏ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అఖిల భారత రవాణారంగ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా మంగళవారం రాష్ట్రంలోని జేఏసీ నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కార్యాలయం ముందు వారిని అడ్డుకునేందుకు కార్యాలయం ప్రధాన గేటు వద్ద పోలీసులు
మోహరించారు. సంఘాల కార్యకర్తలు, నాయకులను తరలించేందుకు వాహనాలను సైతం సిద్ధంగా ఉంచారు. దీంతో ఉదయం 11.30 గంటలకు నిరసనకు పిలుపునిచ్చిన నాయకత్వం వ్యూహాత్మకంగా నిరసన ప్రదర్శనను కార్యాలయం ఎదురు వీధిలో ప్రారంభించింది. ఈ సందర్బంగా కార్మిక నాయకులు, కార్మికులు నెలకు రూ.7500 ఆర్థిక సాయం చేయాలనీ, పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి జీఎస్టీ పరిధిలోకి తేవాలనీ, ప్రయివేటు అప్పులపై ఆరు నెలల పాటు మారటోరియం విధించాలని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని నిలువరించేందుకు అటువైపు పరుగులు తీశారు. శాంతియుతంగా ప్రదర్శన నిర్వహిస్తామనీ, తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించేందుకు వచ్చామని నాయకులు చెప్పగా, కమీషనర్ కు వినతిపత్రం సమర్పించి వెళ్లిపోవాలని సూచించారు. దీనితో ఐదుగురితో కూడిన ప్రతినిధులను లోపలికి వెళ్లి డిమాండ్లతో కూడిన వినితపత్రాన్ని రవాణాశాఖ కమిషనర్ ఎం.వీ.ఆర్ రావుకు వినతిపత్రం సమర్పించారు.
క్యాబినెట్ లో చర్చించాలి : లక్ష్మయ్య
పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారిందని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్) ఉప ప్రధాన కార్యదర్శి ఆర్. లక్ష్మయ్య విమర్శించారు. మార్చిలో రూ.3, మే నెలలో రూ.10 మొత్తం రూ.13 డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం పెంచిందన్నారు. లాక్ డౌన్ సమయంలో ఆటోలు, క్యాబ్ లు తిరగలేదనీ, సడలింపుల తర్వాత కూడా పెద్దగా గిరాకీ ఉండడం లేదని తెలిపారు. ఇలాంటి సమయంలో వారిని ఆదుకునే చర్యలు తీసుకోకపోగా మరింత భారం పడేలా చర్యలు తీసుకోవడం తగదన్నారు. అసంఘటితరంగ కార్మికుల కోసం ప్రత్యేకంగా సామాజిక సంక్షేమ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. అత్యవసర సేవలందిస్తున్న సిబ్బందికి కోవిడ్ నేపథ్యంలో రూ.50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలనీ, టోల్ ట్యాక్స్ , రోడ్ ట్యాక్స్ లను ఎత్తివేసి, ఫిట్నెస్, బీమా ఛార్జీలను తగ్గించాలని కోరారు. మోటారు వాహన చట్ట సవరణ 2019ని వెనక్కి తీసుకోవాలన్నారు..వెంకటేష్ (ఏఐటీయూసీ), షేక్ సలావుద్దీన్ (క్యాబ్ జేఏసీ)లు మాట్లాడుతూ, రవాణారంగంలో ప్రయివేటు అప్పులపై ఆరు నెలల పాటు మారిటోరియం విధించాలనీ, ఓలా, ఊబేర్ డ్రైవర్ల నుంచి యాజమాన్యాలు తీసుకుంటున్న 20 శాతం కమీషన్ ఆపాలనీ, వారిని ఆ కంపెనీ ఉద్యోగులుగానే గుర్తించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పి.శ్రీకాంత్ (సీఐటీయూ), వి.కిరణ్ (ఐఎఫ్టియూ)తో పాటు జేఏసీ నాయకులు అజరు బాబు, కష్ణ, ఆసీఫ్ తదితరులు పాల్గొన్నారు.