Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాలిపేరు రెండు గేట్ల ద్వారా దిగువకు..
- ఎస్సారెస్పీకి ఇన్ఫ్లో
- జూరాలకు స్వల్ప వరద ప్రవాహం
నవతెలంగాణ- విలేకరులు
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల రాష్ట్రంలోని పలు రిజర్వాయర్లు, ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం పెరుగుతోంది. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ 18.5 అడుగుల నీటిమట్టం కాగా, ప్రస్తుతం 18.6 అడుగులకు చేరడంతో అలుగు పోస్తోంది. పాల్వంచ కిన్నెరసాని రిజర్వాయర్ 407 అడుగులకుగాను 405 అడుగుల వరకు నీరు చేరింది.
చర్ల మండల పరిధిలో గల తాలిపేరు మధ్యతరా జలాశయానికి సరిహద్దు ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో రెండ్రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి తాలిపేరు వాగు, నంభి వాగు, రాళ్లవాగుతో పాటు చిన్న వాగులన్నీ పొంగిపొరలి తాలిపేరు జలాశయానికి భారీగా నీరు వస్తోంది. 3628 క్యూసెక్కుల నీరు జలాశయాలకు చేరడంతో అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రాజెక్టు 2 గేట్లను అడుగుల మేర ఎత్తి 2623.702 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు నీటి మట్టం 74.00 మీటర్లు కాగా, ప్రస్తుతం 73.64 మీటర్లు వుంచి అధికంగా వస్తున్న నీటిని ఎప్పటికప్పుడూ దిగువకు విడుదల చేస్తున్నారు.
ఎస్సారెస్పీకి 7752 క్యూసెక్కుల ఇన్ఫ్లో
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు సగటు 7752 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నట్టు ప్రాజెక్టు డీఈ జగదీశ్రెడ్డి తెలిపారు. కాకతీయ కాలువకు, లక్ష్మి, సరస్వతి, అలీసాగర్ ఎత్తిపోతల పథకానికి నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు(90.3టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1074.6 అడుగుల (38.7టీఎంసీలు) నీరు నిల్వ ఉన్నట్టు తెలిపారు. గతేడాది ఇదే రోజు ప్రాజెక్టు నీటిమట్టం 1054 అడుగుల (7.8టీఎంసీలు) వద్ద ఉన్నట్టు చెప్పారు.
జూరాలకు స్వల్ప వరద
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వరప్రదాయిని అయిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ నారాయణపూర్ నుంచి 14వేల కూసెక్కుల నీరు జూరాలకు వస్తోంది. ఔట్ ఫ్లో 17,595 క్యూసెక్కులు. ప్రస్తుతం జూరాలలో 9టీఎంసీల నీటిని నిల్వ ఉంచి.. వచ్చే వరద నీటిని కిందకు వదులుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం 15, 546క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
పెద్దపెల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సామర్థ్యం 20.17టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.06టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు లెవెల్ 148మీటర్లు కాగా ప్రస్తుతం 142.42మీటర్లుగా ఉంది. ప్రాజెక్టులోకి పార్వతి కెనాల్ నుంచి 13050క్యూసెక్కుల నీరు, స్థానిక కాలువల నుంచి 1818 క్యూసెక్కులు వస్తోంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 14868 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 13461క్యూసెక్కులుగా ఉంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మధ్యమానేరు పూర్తి నీటి సామర్థ్యం 25టీఎంసీలు. ప్రస్తుతం 3.5టీఎంసీల నీరు నిల్వ ఉంది.
లక్ష్మీపూర్ పంప్హౌస్ ద్వారా వస్తున్న నీరు రేపు మధ్యమానేరుకు చేరుకొనుంది.
కరీంనగర్ జిల్లాలోని ఎల్ఎండీ నీటి సామర్థ్యం 24టీఎంసీలు. ప్రస్తుతం 10.2టీఎంసీల నీరు ఉంది. వరద నీటి ద్వారా 300టీఎంసీలు, పోచంపాడు ద్వారా 500టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. కాకతీయ కాలువ ద్వారా 5000క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు.