Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తగ్గుతున్న గింజల సాగు
- దిగుమతి తప్పదంటున్న విశ్లేషకులు
- ధరలు పెరిగే అవకాశం?
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వంట నూనెల కొరత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూనె గింజల పంట సాగు గణనీయంగా తగ్గుతున్నది. దీంతో నూనె కొరత ఏర్పడిన తర్వాత దిగుమతులు చేసుకోవాల్సిన పరిస్థితులు రావచ్చు. వాణిజ్య పంటల ప్రభావం పెరిగిపోవడంతో సంప్రదాయ పంటలైన నూనె గింజల సాగు పడిపోతున్నది. దీంతో వినియోగదారుల అవసరాలు తీరాలంటే దిగుమతి చేసుకోవాల్సిందేనని అభిప్రాయాలు వస్తున్నాయి. ఇదే పరిస్థితి ఎదురైతే నూనెల ధరలు అమాంతం పెరిగే అవకాశాలు లేకపోలేదు. ప్రతియేటా రైతులు నూనె గింజ పంటలైన వేరుశనగ, నువ్వులు, పొద్దు తిరుగుడు, సోయా, ఆముదం పంటల సాగు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. వానకాలం ప్రారంభంలో సరైన వర్షాల్లేక పంటల సాగు ఆశించినస్థాయిలో జరగలేదు.
గత మూడేండ్లుగా నూనెల గింజల సాగు పడిపోవడంతో ఉత్పత్తి తగ్గుతున్నది. ఈ ఏడాది కురుస్తున్న వానలతో ఆయిల్ ఫామ్ పంటలు దెబ్బతిన్నాయి. ఈ ఏడాది నూనె గింజల పంటలన్నీ కలిపి కేవలం 4.5 లక్షల ఎకరాల్లో సాగు జరిగింది. వేరుశెనగ 11578 ఎకరాలు సాగు చేయగా, నువ్వులు కేవలం 753 ఎకరాలు, పొద్దు తిరుగుడు అత్యల్పంగా 7 ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఆముదాలు 34వేల ఎకరాల్లో మాత్రమే పంటేశారు. సోయాబీన్ 3.87 లక్షల ఎకరాల్లో సాగైంది. ఫలితంగా పంట దిగుబడి గణనీయంగా తగ్గింది. నూనె గింజల పంటల దిగుబడి తగ్గుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజలకు అవసరమైన వంట నూనెలు ఉత్పత్తి అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో నూనెలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం రావచ్చని రైతు సంఘాలు అంటున్నాయి. గత నాలుగైదేండ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్న విషయం విదితమే.
2017-18 సంవత్సరంలో 6.70లక్షల మెట్రిక్ టన్నుల నూనెగింజల పంట దిగుబడి రాగా 2018-19 ఆర్థిక సంవత్సరానకి వచ్చే సరికి లక్షా 70వేల మెట్రిక్ టన్నులకు దిగుబడి పడిపోయింది. దాదాపుగా 5 లక్షల మెట్రిక్ టన్నులు తగ్గింది. ఈ ఏడాది మరింత దిగజారనుందని అధికారులు సైతం అంటున్నారు. అవసరానికి తగిన ఉత్పత్తి లేకపోవడంతో భారీగా కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ ఏడాది నూనెల ధరలు పెరిగే అవకాశం ఉందని వాణిజ్య నిపుణులు అంటున్నారు.
తగ్గుతున్న సాగు : గత 2017-18 సంవత్సరంలో వానకాలం, యాసంగి సీజన్లు కలిపి నూనె గింజల సాగు 3.74 లక్షల ఎకరాలు కాగా, 6.70లక్షల ఎకరాల టన్నుల దిగుబడి వచ్చింది. వానకాలంలో 3.20లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రాగా, రబీలో 3.50 లక్షల ఎకరాల టన్నుల దిగుబడి, అదే విధంగా గత 2018-19 సంవత్సరంలో రెండు కాలాల్లో కలిపి నూనె గింజల సాగు 3.14లక్షల ఎకరాల్లో సాగు కాగా, 5లక్షల మెట్రిక్ టన్నుల నూనె ఉత్పత్తి అయింది. వానకాలంలో 2.70లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రాగా యాసంగిలో 2.30లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి, 2017-18 నుంచి 2018-19 సంత్సరానికి 70 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి తగ్గింది. ఈ ఏడాది వానకాలంలోనే పంట తీవ్రంగా తగ్గిన నేపథ్యంలో దాని ప్రభావం వంట నూనెలపై పడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
పెరుగుతున్న కొరత :రాష్ట్రంలో ఏడాదికి తలసరి నూనెల వినియోగం 16 నుంచి 19 కేజీల వరకు ఉంటుంది. దీని ప్రకారం ప్రజల అవసరాల కోసం 6.4లక్షల టన్నుల వంట నూనెలు అవసరమయ్యే అవకాశం ఉంది. కానీ ఏటా 3.4 లక్షల టన్నుల వంటనూనె మాత్రమే ఉత్పత్తి అవుతున్నదని ఆయిల్ సీడ్స్ గణాంకాలు పేర్కొంటున్నాయి. ఇంకా 3 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తి అవసరం ఉన్నది. ఈ వ్యత్యాసాన్ని అధిగమించేందుకు కోట్ల రూపాయల నిధులను వెచ్చించి ఇతర దేశాల నుంచి నూనెలను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దేశవ్యాప్తంగా 21 మిలియన్ టన్నుల వంట నూనెల అవసరం కాగా, . ప్రస్తుతం దేశంలో 7 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతుంది. 15 మిలియన్ టన్నుల నూనెను కేంద్ర ప్రభుత్వం రూ 75 వేల కోట్లు ఖర్చు చేసి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నది.