Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూరాల గేట్లు ఎత్తివేత
- శ్రీశైలానికి 2.3 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
కృష్ణా ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతున్నది. పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో కర్నాటక ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్ల నుంచి శనివారం సాయంత్రం 2,20,000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు ఇదే మొత్తంలో నీరు వచ్చి చేరుతున్నది. ఈ ప్రాజెక్టులో ఇన్ఫ్లో 2,10,000 క్యూసెక్కులు నమోదు కాగా శ్రీశైలం ప్రాజెక్టుకు 2,22,560 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 9.66 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 7.99 టీఎంసీలుగా ఉన్నది. శ్రీశైలం ప్రాజెక్టులో ఇన్ఫ్లో గణనీయంగా పెరిగింది. జూరాల నుంచి వచ్చే నీటితో పాటు తుంగభద్ర ప్రవాహాలు కూడా రావటంతో ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతున్నది. ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 850 అడుగులుగా ఉన్నది. రిజర్వాయర్లో ఇన్ఫ్లో లక్ష క్యూసెక్కులకు చేరింది. ఆదివారం ఉదయానికి ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఈ ప్రాజెక్టులో పూర్తిస్తాయి నీటి నిల్వ సామర్ధ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 79.81 టీఎంసీలకు చేరింది. ప్రవాహాలు ఇదే విధంగా కొనసాగితే మరో వారం రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశం ఉన్నదని అధికారులు భావిస్తున్నారు. తుంగభద్ర జలాశయంలో కూడా లక్ష క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. నాగార్జునసాగర్లో పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 558.20 అడుగులకు చేరింది. ఈ ప్రాజెక్టులోపూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 228.21 టీఎంసీలుగా నమోదైంది. సాగర్ ఇన్ఫ్లో 38,140 క్యూసెక్కులుగా ఉన్నది. ఆదివారం ఉదయానికి లక్ష క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉన్నది.
ఎల్లంపల్లికి కాళేశ్వరం నీరు...
ప్రాణహితలో నీటి ప్రవాహం పెరగటంతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. ఎల్లంపల్లిలో ఇన్ఫ్లో 20,880 క్యూసెక్కులకు చేరింది. ఈ ప్రాజెక్టులో పూర్తి నీటి నిల్వ సామర్ధ్య ం 20.18 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 9.03 టీఎంసీలకు చేరింది. శ్రీరామ్ సాగర్లో వరద ప్రభావం లేక పోవటం విశేషం. ఈ ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ కేవలం 37.34 టీఎంసీలుగా ఉన్నది. 25.87 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం కల మిడ్ మానేర్లో 8.05 టీఎం సీలు నమోదు కాగా 24 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం గల లోయర్ మానేర్ డ్యాంలో ప్రస్తుత నీటి నిల్వ 9.03 టీఎంసీలుగా నమోదైంది. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా మిడ్మానేర్, లోయర్ మానేర్ డ్యాంలు నింపాల్సి ఉన్నది.