Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మోతాదుకు మించి ఎరువుల వాడకం వల్ల నేల స్వభావం దెబ్బతినడంతో తెగుళ్లు, పురుగుల బెడద ఉత్పన్నమవుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఇటీవల వ్యవసాయశాఖ సేకరించిన మట్టి నమూనాలను పరిశీలించిన తర్వాత మన నేలల్లో పోటాష్, భాస్వరం అధికంగానూ, నత్రజని కొంచెం తక్కువగా ఉన్నట్టు తేలిందన్నారు. ఈ ఎరువులను అధిక మొత్తంలో వాడడం వల్ల వాతావరణ కాలుష్యమే కాకుండా విషపూరితమైన పంటలు ఉత్పత్తి అవుతున్నాయని గుర్తు చేశారు. వ్యవసాయశాఖ, శాస్త్రవేత్తలు సూచించిన కొన్ని మెళకువలను పాటించినట్టయితే పైన పేర్కొన్న అనర్ధాలను మనస్థాయిలో నిర్మూలించ వచ్చని అన్నారు. ఈ వానాకాలానికిగాను తెలంగాణకు భారత ప్రభుత్వము 22.30 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కేటాయించింది. ఇప్పటి వరకూ 16.15 లక్షల మెట్రిక్టన్నుల ఎరువులు సరఫరా జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు రైతాంగం నియంత్రిత సాగుకు జై కొట్టారని చెప్పారు. వరి, కంది, పత్తిసాగుకే రైతులు మొగ్గుచూపినట్టు మంత్రి తెలిపారు. వానాకాలానికి ముందు జిల్లాల వారీగా వేయాల్సిన పంటలను వ్యవసాయశాఖ తగు సూచనలు ఇవ్వడం తోడ్పడిందన్నారు. క్షేత్రస్తాయిలో రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కొంతమంది చేస్తున్న ప్రచారాన్ని రైతులు నమ్మొద్దని విజ్ఞప్తిచేశారు.