Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భద్రాచలం రెవెన్యూ పరిధిలోని 30 ఎకరాల భూముల ఆక్రమణపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బుర్రి ప్రసాద్, ఆర్.వెంకట్రాములు సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు, రెడ్డిపాలెం, లక్మిపురం గ్రామాలలోని సర్వే నెంబర్ 437లోని 30 ఎకరాల ప్రభుత్వ రెవెన్యూ భూమిని స్థానిక అధికార పార్టీ నాయకులు ఆక్రమించుకున్నారనీ, తహసీల్దార్తో కుమ్మకై తమ వారసుల పేరుతో భూ రికార్డుల్లో మార్చుకోవడం ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, ఆర్డీఓ జోక్యం చేసుకొని భూ ఆక్రమణపై తక్షణమే సమగ్ర విచారణ జరపాలనీ, వాస్తవంగా మాన్యం పొందిన కుటుంబాల వారసులను గుర్తించి వారి పేరుతో పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాన్యపు భూములకు వారసులు లేకపోతే ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలనీ, ఇండ్ల స్థలాలకు ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.