Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీ సర్కారుది అనవసర రాద్ధాంతం..: సీఎం కేసీఆర్ ఆగ్రహం
- కేంద్రానివీ తప్పుడు విధానాలే
- అపెక్స్ కమిటీ సమావేశంలో పూర్తి వాస్తవాలు బయటపెడతాం.. గట్టి సమాధానం చెబుతాం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్థం పర్థం లేని, నిరాధారమైన, అనవసర రాద్ధాంతం చేస్తున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం కూడా తప్పుడు విధానాలనే అవలంభిస్తున్నదని విమర్శించారు. త్వరలో జరగబోయే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వాస్తవాలు, సంపూర్ణ
సమాచారాన్ని ముందు పెట్టి సమర్థవంతంగా వాదనలను వినిపించాలని ఆయన నిర్ణయించారు. ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి గట్టి సమాధానం చెప్పాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదులు చేయడంపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ వైఖరిపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిని ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో జలవనరుల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల పూర్వాపరాలను క్షుణ్నంగా పరిశీలించారు. కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభిప్రాయాలపై చర్చించారు.
'నా అంతట నేనే ఆంధప్రదేశ్ ప్రభుత్వ పెద్దలను పిలిచి, పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడాను. రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలకనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకుందామంటూ స్నేహ హస్తాన్ని అందించాం. బేసిన్లు లేవు.. భేషజాలు లేవంటూ మన వైఖరిని చాలా స్పష్టంగా చెప్పాం. సహజ సరిహద్దు రాష్ట్రాలు కాబట్టి స్నేహ పూర్వకంగా మెలిగి, అంతిమంగా రైతులకు సాగునీరందించే లక్ష్యం సాధించాలంటూ ప్రతిపాదించాం. వృథాగా సముద్రం పాలవుతన్న నీటిని రైతుల పొలాలకు మళ్లించే కార్యాచరణ అమలు చేద్దామని చెప్పాం. అయినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటున్నది. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అర్థం లేని వాదనలతో, నిరాధారమైన ఆరోపణలతో ఫిర్యాదు చేస్తున్నది. అపెక్స్ కమిటీ సమావేశంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం నోరు మూయించేలా, వారి అర్థ రహిత వాదనలను తిప్పికొట్టేలా సమాధానం చెబుతాం. తెలంగాణ ప్రాజెక్టుల గురించి మరోసారి నోరెత్తి మాట్లాడలేని పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కల్పిస్తాం. ఇదే విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా తప్పిదమే. మన రాష్ట్రానికున్న నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. రాష్ట్రం ఏర్పడే నాటికే నీటి కేటాయింపులు జరిగి, అనుమతులు పొంది, ఖర్చు కూడా జరిగిన ప్రాజెక్టుల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఏమాత్రం సరికాదు...' అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
'శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసే విషయంలో కూడా కేంద్రం అనవసరంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది. వాస్తవానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టును నింపిన తర్వాతనే మిగిలిన వాటిని నింపాలి. శ్రీశైలం ప్రాజెక్టు నీటి పారుదల ప్రాజెక్టు కాదు, అది జల విద్యుత్ ప్రాజెక్టు. ఇలాంటి వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేయడం సమంజసం కాదు. ఒక రాష్ట్రంగా తెలంగాణకు కూడా హక్కులుంటాయి. తనకున్న హక్కు ప్రకారం అది ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. ఈ విషయంలో రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం వ్యవహరించడం తగదు. ఈ వైఖరిని కూడా యావత్ దేశానికి తెలిసేలా చేస్తాం. అన్ని వాస్తవాలు వెల్లడిస్తాం...' అని సీఎం ప్రకటించారు.
'గోదావరి, కృష్ణా బేసిన్లలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న హక్కుల ప్రకారమే ప్రాజెక్టులను నిర్మిస్తున్నాం. తెలంగాణ ఏర్పడే నాటికే ఇప్పుడు నిర్మిస్తున్న ప్రాజెక్టులు మంజూరై ఉన్నాయి. వాటికి నీటి కేటాయింపులు జరిగాయి. సీడబ్ల్యూసీ సహా ఇతర సంస్థల నుంచి అనుమతులొచ్చాయి. దాదాపు 23 వేల కోట్ల రూపాయల వరకు నిధుల ఖర్చయ్యాయి. 31,500 ఎకరాల భూ సేకరణ జరిగింది. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు వీటిని కొత్త ప్రాజెక్టులు అనడం అర్థ రహితం, అవివేకం. సమైక్య ఆంధ్రప్రదేశ్లో మంజూరయినప్పటికీ వాటిని పూర్తి చేయలేదు. పైగా తక్కువ నీటితో ఎక్కువ ఆయకట్టును ప్రతిపాదించారు. దీని వల్ల సాగునీటి అవసరాలు సంపూర్ణంగా తీరవు. చాలా ప్రాజెక్టుల డిజైన్ తెలంగాణ అవసరాలకు తగ్గట్టుగా చేయలేదు. కాబట్టి రాష్ట్రం వచ్చిన తర్వాత మన హక్కులు, అవసరాలు, నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులను రీడిజైన్ చేసి నిర్మిస్తున్నాం. దీన్ని తప్పు పట్టడంలో అర్థం లేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీటి కేటాయింపులు జరిపి, ప్రతిపాదించిన ప్రాజెక్టులు కట్టడం లేదనే అసంతృప్తితోనే, నీటి పారుదల రంగంలో జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమం వచ్చింది...' అని సీఎం చెప్పారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీ డిజైన్ చేసి కాళేశ్వరాన్ని, కంతనపల్లి ప్రాజెక్టును రీ డిజైన్ చేసి సమ్మక్క సాగర్ను, రాజీవ్ సాగర్ -ఇందిరా సాగర్ ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి సీతారామ ప్రాజెక్టును, దుమ్ముగూడెం ప్రాజెక్టును రీ డిజైన్ చేసి సీతమ్మ సాగర్ను నిర్మిస్తున్నట్టు సీఎం వెల్లడించారు. పెన్ గంగ ప్రాజెక్టులకు 1975లోనే ఒప్పందం కుదిరి, ట్రిబ్యునల్ అవార్డు కూడా పూర్తయిందన్నారు. ఈ ప్రాజెక్టులు ఎప్పుడు మంజూరయ్యాయి? ఏయే అనుమతులను సాధించారు? తెలంగాణ వచ్చే నాటికే ఎంత ఖర్చు చేశారు? ఎంత భూమి సేకరించారు? విడుదల చేసిన జీవోలు.. తదితర వాస్తవాలను అపెక్స్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా బహిరంగ పరిచటం ద్వారా ఫిర్యాదులు చేసిన వారికి, సందేహాలు వెలిబుచ్చిన వారికి తిరుగులేని సమాధానం చెప్పాలంటూ సీఎం అధికారులను ఆదేశించారు.
'గతంలో జరిగిన మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రలో చేపట్టిన ముచ్చుమర్రిని ప్రస్తావించింది. దీంతో ఈ రెండింటిని కొనసాగించాలని నిర్ణయించారు. మళ్లీ ఆ అంశాన్ని లేవనెత్తడం సరికాదు. పాలమూరు- రంగారెడ్డి విషయంలో కూడా వాస్తవాలను మరోసారి వివరిస్తాం. మంచినీటి అవసరాల కోసం వాడే నీటిలో 20 శాతాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ట్రిబ్యునల్ చెప్పింది. దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రం మంచినీటి కోసం వాడే 110 టీఎంసిలలో 22 టీఎంసిలను మాత్రమే లెక్కకు తీసుకోవాలి. సాగునీటి రంగంలో తెలంగాణకు మొదటి నుంచీ అన్యాయం జరిగింది. ఏలేశ్వరం దగ్గర కట్టాల్సిన నాగార్జున సాగర్ ప్రాజెక్టును 17 కిలోమీటర్ల దిగువన కట్టడం వల్ల అన్యాయం జరిగింది. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కారణంగా ఎగువ కృష్ణ, తుంగభద్ర, బీమా ప్రాజెక్టులు పోయాయి. నీటి వాటాల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదంటూ సాక్షాత్తూ బచావత్ ట్రిబ్యునల్ పేర్కొన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తన నీటి వాటాను అడిగే సందర్భంలో తెలంగాణను పరిగణనలోకి తీసుకోలేదని స్వయంగా ట్రిబ్యునల్ గ్రహించి, తెలంగాణకు ప్రత్యేకంగా నీటిని కేటాయించింది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన జూరాలతోపాటు నెట్టెంపాడు, కల్వకుర్తి, బీమా, కోయిల్ సాగర్ లాంటి ప్రాజెక్టులను తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తి చేసుకోగలిగాం. ఆర్డీఎస్ తూములను ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు బాంబులు పెట్టి పేల్చటం వల్ల గ్రావిటీ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా తెలంగాణకు రావాల్సిన నీళ్లు రాలేదు. సంబంధిత ఆయకట్టును స్థిరీకరించడానికి ఎంతో వ్యయం చేసి తుమ్మిళ్ల లిఫ్టును నిర్మించుకోవాల్సి వచ్చింది. ఇలా సాగునీటి రంగంలో అంతులేని అన్యాయం జరిగింది. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణకు దక్కిన నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులను నిర్మిస్తున్నాం. వాస్తవానికి రాష్ట్రానికి ఇంకా నీటి అవసరం ఉంది, గోదావరి మిగులు జలాల్లో మరో వెయ్యి టీఎంసీలు దక్కాల్సి ఉంది. గోదావరికి తెలంగాణలోనే క్యాచ్ మెంటు ఏరియా ఎక్కువ. నది ప్రవహించేది కూడా మన రాష్ట్రంలోనే ఎక్కువ. తెలంగాణకు అవసరాలు కూడా ఉన్నాయి. సముద్రంలో కలిసే రెండు వేల టీఎంసీల్లో తెలంగాణకు కనీసం వెయ్యి టీఎంసీలు కేటాయించాలి...' అని సీఎం కేంద్రాన్ని కోరారు. సమావేశంలో నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్కుమార్, సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్పాండే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి, ఎమ్మెల్యే సురేందర్తోపాటు జల వనరులశాఖకు సంబంధించిన పలువురు అధికారులు పాల్గొన్నారు.