Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సివిల్ సప్లరు, జీసీసీ కార్పొరేషన్ గోదాముల్లో పనిచేసే హమాలీలకు నూతన రేట్లను అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, ఎం.సాయిబాబు బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. సివిల్ సప్లరు, జీసీసీ హమాలీ కార్మిక సంఘాల(సీఐటీయూ, ఏఐటీయూసీ) జేఏసీ చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. ఎగుమతి-దిగుమతి రేట్ల ఒప్పందం ముగిసి ఏడు నెలలు గడుస్తున్నా నూతన రేట్ల ఒప్పందాన్ని ప్రకటించకపోవడాన్ని తప్పుబట్టారు. నూతన రేట్లను రూ.18 నుంచి రూ.24కి పెంచాలనీ, 2018 ఒప్పందంలో అంగీకరించిన ఈఎస్ఐ, ప్రమాద బీమా, మహిళ స్వీపర్లకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. హమాలీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న ఆందోళన కార్యక్రమాలలో సీఐటీయూ కార్యకర్తలు ప్రత్యక్ష భాగస్వామ్యంతో హమాలీలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. సమ్మె పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం హమాలీలతో చర్చించాలని కోరారు.
ప్రభుత్వం సానుకూలం...సమ్మెను విరమించండి : మారెడ్డి
పౌరసరఫరాల సంస్థలో పని చేసే హమాలీల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సానుకూలంగా ఉందని, పేదలకు ఇబ్బంది కలగకుండా హమాలీలు సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని ఆ సంస్థ చైర్మెన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి హమాలీ యూనియన్లకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విధులకు హాజరైన వెంటనే సమస్యలను చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కోవిడ్-19 నేపథ్యంలో పేద ప్రజలకు నిత్యావసర సరుకులు సకాలంలో అందించాలనీ, గోదాముల్లో బియ్యం లోడింగ్, అన్ లోడింగ్ సమస్యలు రాకుండా, రేషన్ షాపులకు బియ్యం రవాణా జరగాల్సిన అవసరముందని పేర్కొన్నారు. త్వరలోనే హమాలీ యూనియన్ల ప్రతినిధులతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు.