Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీపీఈ కిట్లు ధరించి.. బారికేడ్లు ఎక్కిన ఎన్ఎస్యూఐ నేతలు
అరెస్టులతో ఉద్రిక్త వాతావరణం
- పరామర్శించిన వీహెచ్, శ్రీధర్బాబు, జగ్గారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరీక్షల షెడ్యూల్ను వెంటనే రద్దు చేయాలంటూ ఎన్ఎస్యూఐ నేతలు బుధవారం ప్రగతిభవన్ ముట్టడికి యత్నించారు. పీపీఈ కిట్లు ధరించి విద్యార్థులు మెరుపు ధర్నాకు దిగారు. కేసీఆర్ డౌన్ డౌన్, పరీక్షలను రద్దు చేయాలంటూ పెద్ద పెట్టున నినదించారు. బారికేడ్లు ఎక్కేందుకు ప్రయత్నించారు. పీపీఈ కిట్లు ధరించి రావడంతో పోలీసులు ఎన్ఎస్యూఐ నాయకులను గుర్తించలేదు. వారు తేరుకునేలోగానే ఓ కార్యకర్త గేట్లు ఎక్కి లోనికి దుమికాడు. దీంతో ప్రగతిభవన్ వద్ద ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు టెన్షన్తో పరుగులు తీశారు. అనంతరం ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్తో సహా 20 మందిని అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ సందర్బంగా వెంకట్ మాట్లాడుతూ రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నిర్దారణ పరీక్షల గురించి పట్టించుకోవడం లేదన్నారు. విద్యార్థుల సమస్యలను పెడచెవిన పెట్టిందని విమర్శించారు. ప్రభుత్వం పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులందరినీ వెంటనే ప్రమోట్ చేయాలనీ డిమాండ్ చేశారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి ప్రగతిభవన్ ముట్టడి చేపట్టిన విద్యార్థులపై పోలీసులు కేసులు నమోదు చేసినట్టు సమాచారం. మరోవైపు అరెస్టయిన వారిని మాజీ ఎంపీ వి.హన్మంతరావు, ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్బాబు, జగ్గారెడ్డి పరామర్శించారు.
విద్యార్థులపై కేసులు నమోదు చేయకుండా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎంట్రెన్స్ పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే పరీక్షల షెడ్యూల్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఎన్ఎస్యూఐ హైకోర్టులో కేసు వేసిందనీ, ఆ కేసు విచారణలో ఉండగా పరీక్షల షెడ్యూల్ను ఎలా ప్రకటిస్తారని ప్రభుత్వాన్ని వారు ప్రశ్నించారు.
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా విద్యార్థుల అరెస్టులను ఖండించారు.