Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించాలి : మంత్రి కేటీఆర్
- మంత్రులు, ఉన్నతాధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని రైతులకు ఆర్థిక స్వావలంబనతోపాటు యువతకు ఉపాధి కల్పించటమే తమ ప్రభుత్వ లక్ష్యమని పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. ఇందుకోసం ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరముందని తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్ పాలసీలపై చర్చించేందుకు మంత్రులు, ఉన్నతాధికారులతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయన పలు విషయాలను వివరించారు. పాలసీకి సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పనకు సలహాలు, సూచనలివ్వాలని కోరారు. కార్యక్రమానికి మంత్రులతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్శర్మ, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు హాజరయ్యారు.
రాష్ట్రంలో ఉత్పత్తవుతున్న పంటలను పూర్తిగా ప్రాసెసింగ్ చేసే సామర్ధ్యం మనకు లేదని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తయితే వ్యవసాయ ఉత్పత్తులు ఇంకా పెరుగుతాయని అన్నారు. అందువల్ల తెలంగాణలో ఆహార శుద్ధి పరిశ్రమను అభివృద్ధి చేయడానికి అవసరమైన రాయితీలు, ప్రోత్సాహకాలను అందించేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న ప్రోత్సాహకాలను ఇప్పటికే పరిశీలించామని అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ద్వారా చిన్న యూనిట్ల నుంచి భారీ పరిశ్రమల వరకూ అన్నింటి స్థాపనకూ అవకాశమున్నదని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతకు స్వయం ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. ఇదే సమయంలో ప్రజలకు కూడా కల్తీ లేని, నాణ్యతగల ఆహార ఉత్పత్తులు లభిస్తాయని తెలిపారు. స్వయం సహాయక సంఘాలు, సహకార సంఘాలు, దళిత, గిరిజన, మైనారిటీ యువత, మహిళలకు ఈ విధానం ద్వారా ప్రత్యేక రాయితీలను కల్పిస్తామని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జల విప్లవం కొనసాగుతున్నదని కేటీఆర్ చెప్పారు. దీని తోడ్పాటుతో నీలి విప్లవం (మత్స్య పరిశ్రమ), గులాబీ విప్లవం (మాంస ఉత్పత్తి పరిశ్రమ) శ్వేత విప్లవం (పాడి పరిశ్రమ) కూడా రానున్నాయని తెలిపారు.
మంత్రుల సూచనలు, సలహాలు...
- మారుతున్న పంటల సరళిని దృష్టిలో ఉంచుకుని ఆహార శుద్ధి కంపెనీలను ప్రోత్సహించాలి
- పౌల్ట్రీ, మాంస ఉత్పత్తి, చేపల ప్రాసెసింగ్ రంగాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచాలి
- కొన్ని పనులకు వర్కర్ల కొరత ఉన్నది. ఆయా పనుల్లో యాంత్రీకరణను ప్రోత్సహించాలి
- గిరిజన ప్రాంతాల్లో చిన్న,చిన్న ఆహార శుద్ధి పరిశ్రమలకు తోడ్పాటునందించాలి. దళిత, మహిళా పారిశ్రామిక వేత్తలు ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకునేలా చర్యలు తీసుకోవాలి.
- తెలంగాణ బ్రాండ్ నుంచి నాణ్యమైన ఉత్పత్తులను ప్రపంచం మొత్తం ఎగుమతి అయ్యేలా చూడాలి. ఆహార కల్తీని అరికట్టి వినియోగదారుడికి నాణ్యమైన ఉత్పత్తులను అందించాలి.
- పాలు, పాల ఉత్పత్తులకు విస్తృత అవకాశాలను కల్పించాలి
- ఆధునిక నూనె మిల్లులకు ప్రోత్సాహకాలను అందించాలి.