Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చరిత్రను వక్రీకరించే యత్నంలో బీజేపీ
- రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పరిరక్షణకు పోరాటం : సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బివి.రాఘవులు
- రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పరిరక్షణకు పోరాటం
- తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ఆన్లైన్ బహిరంగ సభ
నవతెలంగాణ - భువనగిరి
నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో నేటి నయా నిజాం, మతోన్మాద పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బివి.రాఘవులు పిలుపునిచ్చారు. సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ అధ్యక్షతన ఆన్లైన్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. ప్రపంచ చరిత్రలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మహోజ్వలమైనదన్నారు. నాడు ప్రసాద్గౌడ్ అన్యాయాలకు వ్యతిరేకంగా, దొరల వెట్టి చాకిరీ, దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా ప్రజలు ఎర్రజెండా నాయకత్వంలో పెద్దఎత్తున పోరాటాల్లో పాల్గొన్నారని వివరించారు. గ్రామ రాజ్యాలు ఏర్పాటు చేసి భూస్వాములను, జాగీర్దారులను, జమీందారులను తరిమికొట్టిన చరిత్ర కమ్యూనిస్టులకుందన్నారు. నాటి చరిత్రలో ఎలాంటి సంబంధమూ లేని బీజేపీ మతోన్మాదులు చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర పాలకుల విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపుని చ్చారు. దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని బతికించుకునే బాధ్యత ప్రజలపై ఉందన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, రాజ్యాంగ సూత్రాలను అపహాస్యం చేస్తున్న బీజేపీ ప్రభుత్వంపై తిరగబడాలన్నారు. లేకపోతే రాజ్యాంగాన్ని రక్షించుకోలేమన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న వీరుల త్యాగాన్ని వెలకట్టలేమన్నారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. కేంద్రంలో మతోన్మాదుల పాలన, రాష్ట్రంలో దళిత, గిరిజన, బహుజనుల వ్యతిరేక పాలన కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకొచ్చాక మతం పేరిట విద్వేషాలను రెచ్చగొడుతున్నారన్నారు. దళిత, గిరిజన, బహుజనులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈ అన్యాయం ఎక్కువగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోందన్నారు. కరోనా కష్టాల్లో ఉన్న ప్రజలను పట్టించుకోని పాలకులు మరోవైపు మోయలేని భారాన్ని వేస్తున్నారన్నారు. ఎల్ఆర్ఎస్ పేరుతో రాష్ట్ర ఖజానా నింపుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల అన్ని వర్గాల ప్రజలపై భారం పడుతుందన్నారు. జిల్లా కార్యదర్శి జహంగీర్ మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులు అమరవీరుల స్థూపాన్ని సందర్శించి, అమరవీరుల కుటుంబాలను కలిసి వారి స్థితిగతులను తెలుసుకోవాలని సూచించారు. 16న జిల్లాలోని ఎనిమిది కేంద్రాల్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పర్యటన ఉంటుందని తెలిపారు. అమరవీరుల కుటుంబాలను నేరుగా కలుస్తామని చెప్పారు. ఈ బహిరంగ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా, నాయకులు పాల్గొన్నారు.