Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూతన పోలీసులకు సమగ్ర అవగాహన కల్పించే దిశగా ఉన్నతాధికారుల చర్యలు
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో తిరిగి పాగా వేయడానికి మావోయిస్టులు ఒకపక్క తమ ప్రయత్నాలను కొనసాగిస్తుండగా, వారిని ఎక్కడికక్కడ కట్టడి చేయడానికి పోలీసుశాఖ సమగ్ర వ్యూహంతో ముందడుగు వేస్తున్నది. గత ఆరేండ్లుగా రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు లేవని, , రిక్రూట్మెంట్ సైతం ఆగిపోయిందని పోలీసు అధికారులు ప్రకటిస్తూ వచ్చారు. కాని ఇటీవల గత రెండు మూడు నెలలుగా మావోయిస్టుల కదలికలు రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణా జిల్లాల్లోని తమకు పట్టున్న ప్రాంతాలలో మొదలు కావడం అధికారులను కొంత కలవరానికి గురి చేసింది. ముఖ్యంగా ఉమ్మడి అదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో భాస్కర్ తో పాటు మరి కొన్ని దళాల ఉన్నట్టు తెలియగానే అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలో డీజీపీ స్వయంగా ఉత్తర తెలంగాణాలో క్యాంప్ వేసి అక్కడి క్షేత్ర స్థాయి పోలీసులను కూడా మావోయిస్టుల కార్యకలాపాలపై అవగాహన కల్పించడం, అప్రమత్త చర్యలను వివరించడం జరిగింది. ఈ మధ్యలోనే ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టును కూడా హతమార్చారు. అయితే చాపకింద నీరులా మావోయిస్టుల్లోకి రిక్రూట్ మెంట్ సాగుతున్నట్టు ఇంటెలిజెన్స్కు సమాచారం అందడంతో పోలీసు ఉన్నతాధికారులు మరింత అలర్ట్ అయ్యారు. ఒక పక్క గ్రేహౌండ్స్ కమాం డోలతో కూంబింగ్ ఆపరేషన్లను ప్రభావిత ప్రాంతాలలో కొనసాగిస్తూనే మరో పక్క ఎస్ఐబీ వంటి నిఘా విభాగాలను మరింతగా పటిష్టం చేస్తున్నారు.
ఇందులో భాగంగానే యాంటీ మావోయిస్టు కార్యకలాపాలపై విశేష అనుభవం కలిగిన అధికారులను రిటైర్ అయినా ఎస్ఐబీలో కొనసాగిస్తూ వారి సేవలను ఉపయోగించు కుంటున్నారు. ఈ చర్యలతోనే ఆగకుండా ఈ మధ్య కాలంలో పోలీసు శాఖలో రిక్రూట్ అయిన కానిస్టేబుళ్లు మొదలుకుని ఎస్ఐల వరకు వారికి మావోయిస్టుల గురించి పూర్తి అవగాహనను కల్పించడానికి కృషి చేస్తున్నారని తెలిసింది. ముఖ్యంగా పాత పీపుల్స్వార్ నుంచి కొత్తగా రూపాంతరం చెందిన మావయిస్టుల వరకు వారి కార్యకలాపాలు, సిద్ధాంతాలు, గెరిల్లా యుద్దరీతులు, వేగలు సిసట్టం గురించిన సమగ్ర సమాచారాన్ని వారికి అందుబాటులో తెచ్చారని తెలిసింది. ముఖ్యంగా అగ్ర నేత గణపతి, పార్జీ జాతీయ కార్యదర్శి నంబాళ కేశవరావు మొదలైన కీలక నాయకత్వం పుట్టుపూర్వోత్తరాలు, వారి ఫోటోలు, నడవడిక, అలవాట్ల, వయసు పెరిగాక వారి ప్రస్తుత రూపురేఖలను వివరిస్తూ అవగాహనను పెంచుతున్నారని తెలిసింది.
దీని వలన ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు, ఆపై అధికారులకు మావోయిస్టులకు సంబంధించి ఎలాంటి సందేహాలు లేకుండా పని చేయడానికి వీలవుతుందని, దాని వలన మంచి ఫలితాలను కూడా రాబట్టగలరని ఒక సీనియర్ పోలీసు ఉన్నతాధికారి అన్నారు.