Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంట్రాక్టర్ తీరును నిరసిస్తూ కార్మికుల ధర్నా
నవతెలంగాణ-పుల్కల్/జోగిపేట
పెండింగ్ వేతనాలు చెల్లించమని కోరుతూ నిరసనలు తెలుపుతున్న కార్మికులపై ఆగ్రహంతో మిషన్ భగీరథ ఏఈ కృష్ణ మండలంలోని మెయిన్ ట్యాంకులకు సంబంధించిన గేటుకు తాళం వేశాడు. దాంతో కార్మికులు గేటు ఎదుట నిరసనకు దిగారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం రాయపాడు శివారులో శుక్రవారం జరిగింది. మిషన్ భగీరథ కాంట్రాక్టు కార్మికులు పెండింగ్ వేతనాలు చెల్లించాలని కొన్ని రోజులుగా నిరసనలు తెలుపుతూ వినతిపత్రాలు అందజేస్తుండటంతో అన్ని మండలాలకు నీటి సప్లయి చేసే మెయిన్ ట్యాంకులకు చెందిన గేటుకు తాళం వేయడంతో పలు మండలాలకు చెందిన సుమారు 150కి పైగా కార్మికులు గేటు ఎదుట బైటాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ..
ఎనిమిది నెలల నుంచి వేతనాలు చెల్లిండం లేదని, అడిగినందుకు గేటుకు తాళం చేసి వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్, అధికారులు కలిసి తమ వేతన బకాయిలు చెల్లించకుండా నిరసన తెలిపిన ప్రతిసారి చెల్లిస్తామని హామీలు ఇస్తున్నారే తప్ప నెరవేర్చడం లేదని వాపోయారు. కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా పనులు చేయిస్తున్నారని మండిపడ్డారు. రాత్రి, పగలు కష్టపడుతుంటే కేవలం రూ.7500 మాత్రమే చెల్లిస్తున్నారనీ, వాటినీ సకాలంలో ఇవ్వట్లేదనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వేతనం రూ.20,000కు పెంచాలని డిమాండ్ చేశారు. మొండిగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కార్మికుల ధర్నాకు సీఐటీయూ మద్దతు తెలిపి కార్మికులతో కలిసి జోగిపేట మండలంలోని డీఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. వేతనాలు చెల్లించడంలో కాంట్రాక్టర్ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని, తక్షణమే కాంట్రాక్టర్పై చర్యలు తీసుకొని కార్మికులను ఆదుకోవాలని ఆ సంఘం మండల కార్యదర్శి డి విద్యాసాగర్ డిమాండ్ చేశారు.