Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరుగుతున్న వరద ప్రవాహం
- లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగిన పైర్లు
- ఉప్పొంగుతున్న వాగులు
నవతెలంగాణ - విలేకరులు
రాష్ట్రానికి ఎగువప్రాంతాల్లో, రాష్ట్రంలో 4రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు కృష్ణా, గోదావరి బేసిన్ ప్రాజెక్టుల్లో వరద పోటెత్తుతోంది. అదేసమయంలో రాష్ట్రం లోని లోతట్టుప్రాంతాలు పూర్తిగా జలమయ మ య్యాయి. ఆ ప్రాంతాల్లోని జనం బిక్కుబిక్కుమంటు బతుకుతున్నారు. పైర్లు నీట మునిగాయి. రోడ్లు తెగిపోయాయి. ప్రధాన ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. వరద ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు ఎప్పటికప్పుడూ అంచనా వేస్తూ గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. రెండేండ్ల తరువాత ఉమ్మడి మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులోకి కూడా నీరు చేరింది. శుక్రవారం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ప్రధానంగా నిర్మల్ జిల్లాలో కుండపోత వర్షంతో జనజీవనం స్తంభించింది. కొన్ని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సిరాల ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో ఇలేగాం వాగు ఉప్పొంగి ప్రవహించింది. దేగాం వంతెనపై నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాలు నీటమునిగాయి. రహదారులపై నుంచి భారీగా నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. చేతికొచ్చిన సోయా, పత్తి పైర్లు వర్షపు నీటిలో ముగినిపోయాయి. ముధోల్ - ధర్మాబాద్ రహదారిపై నిర్మించిన బ్రిడ్జి నుంచి వాగు పొంగిపొర్లింది. దీంతో ముధోల్ నుంచి మహారాష్ట్రలోని ధర్మాబాద్కు రాకపోకలు నిలిచాయి. బాసర మండల కేంద్రంలోని రవీంద్రపూర్ కాలనీలో పలు ఇండ్లలోకి నీరు చేరింది.
పిడుగుపాటుకు మహిళా కూలీ మృతి
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్లో పిడుగుపాటుకు వ్యవసాయ మహిళా కూలీ జంగపెల్లి లకిë(50) మృతిచెందింది. లకిë ఉదయం గ్రామ శివారులోని పత్తి చేనులో కలుపు తీసేందుకు వెళ్లింది. పనిలో ఉన్న క్రమంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులు వచ్చి పిడుగు పడింది. దీంతో అక్కడ పనిచేస్తున్న వారంతా సొమ్మసిల్లి పడిపోయారు. కొంత సేపటికి వారంతా మామూలు స్థితికొచ్చినప్పటికీ లక్ష్మి కొన ఊపిరితో కొట్టుకుంది. తోటి కూలీలు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. ఆమెను చేనులోంచి రోడ్డుకు తెచ్చే క్రమంలోనే మృతిచెందింది. ఎస్ఐ సంజీవ్, తహసీల్దార్ విజయానందం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ఖైరిలో వర్షానికి కుప్పకూలిన ఇల్లు
ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ఖైరి గ్రామ పంచాయతీ పరిధిలోని ఇందిరానగర్ గ్రామంలో నగోసే నారాయణ ఇల్లు వర్షం కారణంగా కుప్పకూలింది. ఆ సమయంలో నారాయణతో పాటు భార్య మాయబాయి, 11 నెలల కుమార్తె ఉన్నారు. ఇల్లు పడిపోయే పరిస్థితిని గమనించి బంధువు ఇంట్లోకి వెళ్లడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.
కడెం, గడ్డెన్నవాగు ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత
కడెం, గడ్డెన్నవాగు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. కడెం ప్రాజెక్టు 7వ నెంబర్ గేట్ ఐదు అడుగుల మేర ఎత్తి 5324 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. సాగు అవసరాల కోసం 400 క్యూసెక్కులను ప్రధాన కాలువ ద్వారా నిరంతరం వదులుతున్నారు. మత్స్యకారులు చేపలు పట్టేందుకు వెళ్లవద్దని, రైతులు తమ పశువులను మేపే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఈఈ రాజశేఖర్ సూచించారు. భైంసా సమీపంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు 2 గేట్లను ఎత్తి 14వేల క్యూసెక్కుల నీటిని సుద్దవాగులోకి వదిలారు. దీంతో సుద్దవాగు ఉప్పొంగడంతో పరివాహక ప్రాంతమంతా జలమయమైంది.
పాలమూరులో 50వేల ఎకరాల్లో పంట నష్టం
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల 50 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. 25 వేల ఎకరాల్లో పత్తి, 25 వేల ఎకరాల్లో వరి, కంది పంటలకు నష్టం వాటిల్లింది. ప్రధానంగా గద్వాల జిల్లాల్లో కృష్ణా నది పరివాహక ప్రాంతం, అలంపూర్ తుంగభద్ర ప్రాంతంలో పత్తి, వరి పంటలు అధికంగా నష్టపోయాయి. దుందుభి నది పరివాహక ప్రాంతంలో 10 వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. కేసరి సముద్రం వాగు పరిసర ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో వరి పైరు జలమయమైంది. గద్వాల, కొత్తకోట, మదనాపురం, కృష్ణ, కోయిల్సాగర్ తదితర ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సుమారు కోటి రూపాయల పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా.
జూరాల 19 గేట్లు ఎత్తివేత
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి లక్షా 48,600 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండటంతో 19గేట్లు ఎత్తి కిందకు వదులుతున్నారు. నారాయణపూర్ నుంచి 23,471క్యూసెక్కుల నీరు వస్తోంది. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 9.615టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.750టీఎంసీల నిల్వ ఉంది. విద్యుత్ ఉత్పత్తి కోసం 27,760క్యూసెక్కుల నీటిని పవర్ హౌస్ ద్వారా వదులుతున్నారు. దీని ద్వారా ఐదు యూనిట్లలో 195 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నట్టు అధికారులు తెలిపారు.
సాగర్ 10 క్రస్టు గేట్ల ద్వారా నీటి విడుదల
నాగార్జున సాగర్ డ్యాం 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 8 గేట్లను 10 అడుగులు, రెండు గేట్లను రెండు అడుగుల మేరకు ఎత్తి 1,35,588 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు డ్యాం అధికారులు తెలిపారు. ఎగువ నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి 1,71,085 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో వస్తోంది. సాగర్ డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.60 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 25,497 క్యూసెక్కులు, కుడి కాల్వ ద్వారా 8680 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 1800, లోలెవల్ కెనాల్ ద్వారా 300 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి శ్రీశైలం రిజర్వాయర్కు 2,24,814 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.10 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. ఇది 210.5133 టీఎంసీలతో సమానం.
ఎస్సారెస్పీ 40 గేట్లు ఎత్తివేత
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఎస్సారెస్పీకి భారీ వరద వస్తోంది. దీంతో ప్రాజెక్టు 40 గేట్లు ఎత్తి లక్షా యాభై వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. శుక్రవారం సగటు 90 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండటంతో 1.50 లక్షల క్యూసెక్కులు విడుదల చేసినట్టు ప్రాజెక్టు డీఈ జగదీశ్రెడ్డి తెలిపారు. మహారాష్ట్రలో భారీ వర్షాలతో వారం రోజులుగా ప్రాజెక్టుకు 50 వేల క్యూసెక్కులకు మించి వరద ప్రవాహం కొనసాగుతోంది. పోచారం ప్రాజెక్టు నిండు కుండలా మారి పొంగిపొర్లడంతో మంజీర నది గుండా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 6500 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నట్టు ప్రాజెక్టు డీఈఈ దత్తాత్రి తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు (17.802 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1390.66 అడుగుల (4.321 టీఎంసీల) నీరు నిల్వ ఉన్నట్టు తెలిపారు..