Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైకోర్టు తుది తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వైద్యారోగ్యశాఖలో పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఎన్ఓఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎన్ఓఏ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రుఢావత్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 9,270 నర్సుల పోస్టులకు గాను కేవలం 4,373 మంది మాత్రమే ఉన్నారనీ, ప్రస్తుతం 3311 ఖాళీలు భర్తీ చేస్తే కొంత మేరకు ఉపశమనం కలుగుతుందని చెప్పారు. ఇప్పటికే పరీక్షలు రాసిన 21 వేల మంది ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరింత జాప్యం చేయకుండా పోస్టులు భర్తీ చేస్తే నిరుద్యోగ అభ్యర్థులకు, ప్రజలకు మేలు కలుగుతుందని అభిప్రాయపడ్డారు.
కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం : గోవర్థన్
కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ విధానాల్లో పని చేస్తున్న నర్సులకు వెయిటేజీ మార్కులు ఇవ్వడం న్యాయమంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు తెలంగాణ నర్సింగ్ సమితి (టీఎన్ఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు గోవర్థన్ తెలిపారు. ఈ మేరకు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, గత 10, 15 ఏండ్ల నుంచి దాదాపు 1800 మంది నర్సులు కాంట్రాక్టు పద్దతిలో సేవలందిస్తున్నారని చెప్పారు. వారిలో కొందరికి వయోపరిమితి దాటడంతో నోటిఫికేషన్ ఇచ్చినా అనర్హులుగా మిగిలిపోతారని పేర్కొన్నారు.