Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజనశాఖ కార్యాలయం ముందు హాస్టల్స్, డైలీవేజ్ ఔట్సోర్సింగ్ కార్మికుల ధర్నా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీవేజ్, ఔట్సోర్సింగ్ కార్మికులకు లాక్డౌన్ కాలానికి పూర్తి వేతనాలు చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్.రమ డిమాండ్ చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్ డైలీవేజ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లోని ఆ శాఖ కార్యాలయం ముందు ఫ్ల కార్డులు, జెండాలు పట్టుకొని భౌతిక దూరం పాటిస్తూ ధర్నా నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు జరిగిన ఆందోళన కార్యక్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ధర్నా నుద్ధేశించి రమ మాట్లాడుతూ కరోనా లాక్డౌన్తో వేతనాలు లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వం కొత్త సచివాలయం నిర్మిస్తున్నదని విమర్శించారు. ఐదేండ్ల సర్వీస్ పూర్తయిన కార్మికులందరిని రెగ్యులర్ చేయాలనీ, ఖమ్మం జిల్లాలో పీఎంహెచ్ హాస్టల్లో పనిచేస్తున్న కార్మికులకు 2018 నుంచి బకాయి ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్చేశారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు జె. వెంకటేష్ మాట్లాడుతూ 2016లో హైకోర్టు ఇచ్చిన జీఓ నెం.16, గిరిజన సంక్షేమ శాఖ కమీషనర్ మెమో ప్రకారం పదేండ్ల సర్వీస్ ఉన్న వారిని పర్మినెంట్ చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ పార్ట్టైమ్, టైమ్స్కేల్, డైలీవేజ్ అంటూ ముద్దు పేర్లు పెట్టి ప్రభుత్వం కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నదని విమర్శించారు. లాక్డౌన్ కాలంలో అందరికీ జీతాలు ఇవ్వాలని జీఓ నెం.45 ఇచ్చిన ప్రభుత్వం తన ఆదేశాలను తానే ఉల్లంఘించి వేతనాలు ఎగ్గొట్టిందని విమర్శించారు. ఈ ధర్నా కార్యక్రమం అనంతరం 16 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఉన్నతాధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు టేకం ప్రభాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్, రాష్ట్ర కార్యదర్శి బ్రహ్మచారి, నాయకులు సులోచన, హీరాలాల్, బి. శ్రీను, టి. శ్రీనివాసులు, జి. రాములు, రవి, నర్సింహ, కన్నప్పరాజు తదితరులు పాల్గొన్నారు.