Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ శ్రేణులకు చాడ వెంకట రెడ్డి పిలుపు
నవతెలంగాణ - కరీంనగర్ టౌన్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను గాలి కొదిలేసారనీ, సమస్యల పరిష్కారానికి ప్రజా పోరాటాలకు సీపీఐ శ్రేణులు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివార స్థానిక బద్దం ఎల్లారెడ్డి భవన్లో జరిగిన ఆ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ, ప్రయివేటు, కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ ఆస్తులను కట్టబెడుతోందని మండిపడ్డారు.
విద్యుత్ సంస్కరణల చట్టం సవరణ వల్ల వినియోగదారులపై భారం పడుతుందని, కేంద్రం తీసుకువచ్చే వ్యవసాయ బిల్లు వల్ల రైతులకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. కోవిడ్తో ఆర్నెల్లుగా దేశంలోని వివిధ రాష్ట్రాల ఆదాయం తగ్గిందని ఈ తరుణంలో కేంద్రం ఆదుకోవాల్సింది పోయి రాష్ట్రాలకు చెల్లించాల్సిన పన్నుల వాటాను ఇవ్వకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నేటికి ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. సచివాలయం కట్టడంపై ఉన్న ధ్యాస పేద, బడుగు, బలహీన వర్గాలకు డబుల్ బెగ్రూ ఇండ్లు కట్టించడంపై లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఇలా అనేక సంక్షేమ పథకాల అమలు అసంపూర్తిగా ఉన్నాయని వాటన్నింటిపై సీపీఐ శ్రేణులు దృష్టి పెట్టి దశల వారిగా ఆందోళనలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేని శంకర్, జిల్లా కార్యదర్శి పోనగంటి కేదారి, నాయకులు కూన శోభారాణి, కొయ్యడ సృజన్కుమార్, మర్రి వెంకట స్వామి పాల్గొన్నారు.