Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం ఆదేశం
- వర్షాలు, వరదలపై సీఎస్తో సమీక్ష
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో... కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశించారు. వర్షాలు, వరదలపై ఆయన ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్తో సమీక్షించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ ఉండాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. అన్ని శాఖల అధికారులు జిల్లా కేంద్రాల్లో అందుబాటులో ఉండాలనీ, తద్వారా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరక్కుండా చూడాలని ఆదేశించారు. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు ఇప్పటికే జారీ చేసిన వరద ప్రొటోకాల్ (ఫ్లడ్ ప్రొటోకాల్)ను తప్పనిసరిగా అమలు చేయాలని సీఎస్ ఆదేశించారు. వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశముంటుంది.. దీంతో ఆయా ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోవటం వల్ల సాధారణ కార్యకలాపాలకు అంతరాయమేర్పడుతుందని వివరించారు. చిన్న చిన్న వంతెనలు, కాజ్వేల్లో నీరు భారీగా ప్రవహించే అవకాశముందని తెలిపారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండి, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎస్ ఆదేశించారు.
భానుమూర్తి మరణం పట్ల సీఎం సంతాపం...
తెలంగాణ అర్చక, ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు గంగు భానుమూర్తి హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్రకటనలో తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.