Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐకేఎస్ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి
- రైతు, కార్మిక సంఘాల కో-ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యాన బిల్లు ప్రతుల దహనం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెట్టేందుకు వీలుగా మోడీ సర్కార్... పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను ఆమోదింపజేసిందని అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. దీనివల్ల రైతులు... కూలీలుగా మారిపోనున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అఖిల భారత రైతు, కార్మిక సంఘాల కో-ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో... సోమవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద రైతాంగానికి వ్యతిరేకంగా ఉన్న వ్యవసాయ బిల్లుల పత్రాలను దహనం చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సారంపల్లి మాట్లాడుతూ... కార్పొరేట్ శక్తుల లాభాల కోసం కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాల హక్కులను హరించి వేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి రాజ్యాంగ వ్యతిరేక చర్యలని విమర్శించారు. రాష్ట్రపతి ఈ బిల్లులను ఆమోదించకుండా వెనక్కి పంపాలని డిమాండ్ చేశారు.
రైతులు కోరుతున్న రుణమాఫీ, పంటలకు మద్దతు ధరలు, సబ్సీడీలు, మార్కెట్ సౌకర్యాల కల్పన లాంటి బాధ్యతల నుంచి కేంద్రం తప్పుకుంటున్నదని చెప్పారు. రాజ్యసభలో అప్రజాస్వామికంగా ఆమోదింపజేసుకున్న వ్యవసాయ బిల్లులు.. వెనుకబడిన తెలంగాణలాంటి రాష్ట్రాలకు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తాయని హెచ్చరించారు. కమిటీ జాతీయ నాయకులు వేములపల్లి వెంకటరామయ్య మాట్లాడుతూ...కార్పొరేట్, కాంట్రాక్టు సహకార వ్యవసాయం పేరుతో రైతులను తమ పొలాల్లోనే కూలీలుగా మార్చబోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్య మాట్లాడుతూ... భవిష్యత్లో ధాన్యం సేకరణ బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకోనుందని అన్నారు. కార్యక్రమంలో పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బి.పద్మ, పీవైఎల్ రాష్ట్ర కార్యదర్శి హన్మేశ్, రాహుల్, ఆర్ ఆంజనేయులు, కొండలు తదితరులు పాల్గొన్నారు.