Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ దృష్టిలో సీఏఏ వ్యతిరేకులందరూ కుట్రదారులు
- వాళ్లని కేసుల్లో ఇరికించాలన్నది కేంద్రం వ్యూహం
- 'ఢిల్లీ అల్లర్ల'పై మానవ హక్కుల ఉద్యమకారుడు హర్షమందర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరిలో చెలరేగిన మత ఘర్షణ లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, పోలీసులు కలిసి.. మసా లా దట్టించిన ఓ కట్టు కథను అల్లాయని మానవ హక్కుల ఉద్యమకారుడు హర్ష మందర్ అన్నారు. ఇందులో భాగంగానే తనతోపాటు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ప్రొఫెసర్ జయతీఘోష్ సహా పలువురిపై కేసులు నమోదు చేశారని తెలిపారు. అల్లర్లకు కారణమైన బీజేపీ, దాని అను బంధ సంస్థలకు చెందిన వారిని వదిలేసి.. వామపక్ష నేతలు, అభ్యుదయవా దులను ఈ కుట్రలోకి లాగుతున్నారని చెప్పారు. తద్వారా సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్న వారందరిపై ఏదో ఒక రూపంలో దోషులు, నిందితులు, కుట్రదారులనే ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో అభ్యుదయ, ప్రజాతంత్రవాదులందరూ నోర్మూసు కుని, నిశ్శబ్దంగా ఉంటే సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్కు వ్యతిరేకం గా ఇప్పటిదాకా చేసిన సుదీర్ఘ పోరాటం వృథా అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అందువల్ల ప్రతి ఒక్కరూ వీటికి వ్యతిరేకంగా గొంతెత్తాలని పిలుపునిచ్చారు.
'ఢిల్లీ అల్లర్లు- పోలీసుల వెనకనున్న కుట్ర ఏమటి...?' అనే అంశంపై హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వ ర్యాన సోమవారం ఆన్లైన్ వేదికగా చర్చాగోష్టిని నిర్వహిం చారు. ఎస్వీకే మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్.వినయకుమార్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో హర్ష మందర్ ముఖ్య వక్తగా ప్రసంగిస్తూ... ఢిల్లీ అల్లర్లను విషాదకర సంఘటనగా అభివర్ణించారు. దేశ విభజన అనంతరం రాజధానిలో ఇలాంటి మత ఘర్షణలు జరగటం ఇదే మొదటిసారని చెప్పారు. 53 మంది మరణించారనీ, ఎంతో మంది క్షతగాత్రులయ్యారనీ, అనేక మంది మహిళలు లైంగిక దాడులకు గురయ్యారని
ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇందుకు సంబం ధించి పోలీసులు, కేంద్రం చెబుతున్న కుట్ర కోణానికి, మనం (అభ్యుదయవాదులు, మేధావులు) చెబుతున్న దానికి ఎంతో తేడా ఉందని వివరించారు. దేశంలో గతంలో జరిగిన అనేక మత ఘర్షణలను పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతున్నదని అన్నారు. ప్రభుత్వ ప్రమేయం లేని ఎలాంటి మత కల్లోలాలైనా ఐదారు గంటలకు మించి కొనసాగబోవని చెప్పారు. కానీ సర్కారే ఉద్దేశపూర్వంగా వాటిని కొనసాగించదలిస్తే.. అవి రోజల తరబడి అలాగే అగ్నికి ఆజ్యం పోసినట్టు రగులుతూ ఉంటాయని తెలిపారు. ఢిల్లీలో పోలీసు బలగాలు, వారి యంత్రాంగం, వసతులు, వనరుల సమీకరణ కావాల్సినంతగా ఉన్నప్పుడు... ఈ అల్లర్లు రోజుల తరబడి ఎలా కొనసాగుతాయని ఆయన ప్రశ్నించారు. మరోవైపు అల్లర్లు జరిగిన తీరును నిశితంగా పరిశీలిస్తే.. హిందూ, ముస్లింలు నివసించే ప్రాంతాలను, వారి ఇండ్లను ముందే గుర్తించారన్న విషయం విదితమవుతున్నదని అన్నారు. పేలుడు పదార్థాలు, మందుగుండు సామాగ్రి, గ్యాస్ సిలిండ ర్లు, కత్తులు, ఇతర మరణాయుధాలు ఆయా ప్రాంతా లకు ముందే ఎలా వచ్చాయని ప్రశ్నించారు. దీన్నిబట్టి ఢిల్లీ అల్లర్లలో ప్రభుత్వ పాత్ర ఏంటనే విషయం స్పష్టమవుతున్నదని అన్నారు. కేసు విచారణలో భాగంగా పోలీసులు పలువురి వాంగ్మూలాలను నమోదు చేస్తున్న క్రమంలోనే ఎంపిక చేసిన మీడి యా సంస్థలకు కావాలనే కొన్ని లీకులను విడుదల చేశారని తెలిపారు. తద్వారా ప్రజలకు తప్పుడు సంకే తాలను పంపుతున్నారని గుర్తు చేశారు. సీఏఏ వ్యతి రేక ఆందోళనల్లో పాల్గొన్న వారిని ఉగ్రవాదులుగా చిత్రీకరించటమే దీని వెనుకున్న అసలు ఉద్దేశమని తెలిపారు. ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలని ఆయన ప్రజానీకానికి పిలుపునిచ్చారు. హర్ష మందర్ ప్రసంగాన్ని ప్రముఖ విశ్లేషకులు కొండూరి వీరయ్య తెలుగులోకి అనువదించారు.