Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ అధికారులకు సెలవులు రద్దు
- పది రోజుల్లో 54సెం.మీ వర్షపాతం
- రోడ్లకు వెంటనే మరమ్మతులు : మంత్రి కేటీఆర్ సమీక్ష
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్లోని ఓపెన్ నాలాలపై కప్పులు ఏర్పాటు చేస్తామని పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పట్టణాల్లోని పరిస్థితులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో మున్సిపల్ అధికారులకు రెండు వారాలపాటు సెలవులు రద్దు చేస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. వర్షాలు తగ్గగానే అన్ని మున్సిపాలిటీల్లో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణలో వేగం పెంచాలని సూచించారు. మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్కుమార్తో కలిసి పురపాలక శాఖ, జీహెచ్ఎంసీ, జలమండలి ఉన్నతాధికారులతో సోమవారం ట్యాంక్బండ్ బుద్ధ భవన్లో మంత్రి సమీక్షాసమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వర్షాలు మరో రెండు వారాలపాటు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేకంగా సీనియర్ అధికారులకు బాధ్యత అప్పగించాలని, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు కమిషనర్లు సైతం ఆకస్మిక తనిఖీలు చేస్తూ పరిస్థితిని పర్యవేక్షణ చేయాలని సూచించారు. ప్రస్తుతం సాధారణం కన్నా అధికంగా వర్షపాతం నమోదవుతుందని, హైదరాబాద్ నగరంలోనే పది రోజుల్లో 54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు వివరించారు. భారీ వర్షాల్లోనూ పురపాలక శాఖ అధికారులు వెంటనే స్పందించి సాధ్యమైనంత సహాయక చర్యలు చేపడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పటిదాకా వర్షాల వల్ల రెండు సంఘటనల్లో ప్రాణ నష్టం సంభవించినట్టు అధికారులు మంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. కూలి పోయేందుకు సిద్ధంగా, బలహీనంగా ఉన్న భవనాలను వెంటనే గుర్తించి కూల్చేయాలని సూచించారు. ఇప్పటికే గుర్తించిన ఇలాంటి భవనాలను మరింత వేగంగా కూల్చాలన్నారు. భవన నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండేలా ప్రయివేట్ కాంట్రాక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేయాలన్నారు. ప్రభుత్వం మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టిన కార్యక్రమాల నేపథ్యంలో తవ్విన గుంతల చుట్టూ కంచె వేయాలని సూచించారు. ఇప్పటికే గుర్తించిన వాటర్ లాగింగ్ పాయింట్లలో ప్రత్యేక బృందాలను పెట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో 170 వర్షాకాల అత్యవసర బృందాలు పని చేస్తున్న విషయాన్ని అధికారులు మంత్రికి తెలిపారు. వర్షాల కారణంగా పాడైన రోడ్లను వెంటనే మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకోవాలని, వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాత యుద్ధప్రాతిపదికన రోడ్లన్నింటినీ పూర్వస్థితికి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్లోని ఓపెన్ నాలాల క్యాపింగ్ నిర్మాణానికి (బాక్స్ డ్రెయినేజీల నిర్మాణం) భారీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు మంత్రి కేటీఆర్ చెప్పారు. రెండు మీటర్ల కన్నా తక్కువ వెడల్పు ఉన్న నాలాలపై క్యాపింగ్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు సుమారు రూ.300 కోట్లు అవుతాయని, వీటన్నింటికీ త్వరలోనే పరిపాలనాపరమైన అనుమతులు ఇస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్కుమార్, వాటర్బోర్డు ఎండీ దానకిషోర్, సీడీఎంఏ కమిషనర్ సత్యనారాయణ, సీసీపీ దేవేందర్రెడ్డి, ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, సీడీఎంఏ, జీహెచ్ఎంసీ, వాటర్బోర్డు అధికారులు పాల్గొన్నారు.