Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యలపై నినదించిన గొర్లమేకల పెంపకందారులు
- జిల్లాల్లో ఎక్కడికక్కడ అరెస్టులు
- నలువైపులా మోహరించిన పోలీసులు
- వాగ్వాదం.. తోపులాట, రోడ్డుపైనే బైఠాయింపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
''తమ బాధలను తీర్చాలంటూ గొర్లమేకల పెంపకందారులు చేపట్టిన ప్రగతిభవన్ ముట్టడిని పోలీసులు అడ్డుకున్నారు. అయినా వెరవకుండా గుంపులు, గుంపులుగా అక్కడికి చేరుకుని తమ నిరసనను గట్టిగా వినిపించారు. సమస్యలను పరిష్కరిం చాలని నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ డౌన్...డౌన్ అంటూ ఆందోళన చేశారు. ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇది కొనసాగింది. పదే పదే పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో ఉద్రిక్తతకు కారణమై ట్రాఫిక్కూ ఇబ్బంది కలిగింది.'' గొర్రెల పంపిణీలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ గొల్లకురుములు ప్రగతిభవన్ను ముట్టడించారు. సోమవారం గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం (జీఎంపీఎస్) ఆధ్వర్యంలో ''తెలంగాణ గడీ ముట్టడి'' పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది గొల్లకురుములు హైదరాబాద్ బయలుదేరగా ఆదివారం రాత్రి నుంచే ఎక్కడికక్కడ అరెస్టుల పర్వాన్ని కొనసాగించింది. ప్రగతిభవన్ వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమాజీగూడ సర్కిల్ నుంచి గ్రీన్ ల్యాండ్స్ వరకు రోడ్డుకు ఇరువైపులా పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఆందోళనకారులు ఉదయం 11 గంటల తర్వాత దఫా దఫాలుగా దాదాపు 300 మంది భవన్ను ముట్టడించేందుకు ప్రగతిభవన్ వైపు పరుగులు తీశారు. ఆటోలు, వ్యాన్లు, ఇతర వాహనాల్లో దూసుకొచ్చిన గొల్లకురుమలను ఆయా చౌరస్తాల్లోనే నిలువరిస్తూ పోలీసులు అరెస్టు చేశారు. రోడ్డుకు రెండు వైపులా పోలీసు వాహనాలు, ఉద్యమకారులను తరలించేందుకు వాహనాలను సిద్ధంగా ఉంచారు. ఇరుపక్షాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసు కుంది. పోలీసుల దౌర్జన్యం మూలంగా కొంత మంది రోడ్లపై పరుగులు పెట్టడంతో పలుమార్లు ట్రాఫిక్ నిలిచిపోయింది. నాయకులు మీడియాతో మాట్లాడుతుండగానే పోలీసులు అరెస్టు చేస్తుండడంతో నిరసనకారులు రోడ్డుపై బైఠాయించారు. డిమాం డ్లతో కూడిన ప్లకార్డులు, బ్యానర్ ప్రదర్శిస్తూ తమ సమస్యలను పరిష్కరించాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉదయం 11.20 గంటల సమయంలో బేగంపేట నుంచి ప్రగతిభవన్ వైపు వస్తున్న ఉద్యమకారులను పోలీసులు గ్రీన్ ల్యాండ్స్ వద్దే అడ్డుకున్నారు. తిరిగి 12.30 గంటల సమయంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ నేతృత్వంలో నాయకులు పంజాగుట్ట వైపు నుంచి ప్రగతిభవన్ రావడానికి ప్రయత్నించడంతో వారిని సోమాజీగూడ సర్కిల్ సమీపంలోనే నిలిపేశారు. బలవంతంగా అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. అనంతరం మరో బందం బేగంపేట వైపు నుంచి వచ్చింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడానికి చేసిన ప్రయత్నం విఫలం కావడంతో ప్రగతిభవన్ వద్దకు చేరి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున వారిని చుట్టుముట్టి రోడ్డు అవతలికి తీసుకెళ్లి అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారందరిని గోషామహల్ పోలీస్స్టేషన్కు తరలించారు.
విన్నవించినా పట్టించుకోలేదు...అందుకే రోడ్డెక్కాం : ఉడుతల రవీందర్
గొర్రెలు ఇవ్వాలని, తమ సమస్యలు పరిష్కరించాలని అనేక సార్లు కలెక్టర్లకు, పశుసంవర్ధక శాఖ అధికారులకు, మంత్రులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో రోడ్డెక్కాల్సి వచ్చిందని ఉడుతల రవీందర్ తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రెండో విడత గొర్రెల పంపిణీ అవకతవకలకు తావు లేకుండా నగదు బదిలీ ద్వారా చేపట్టాలనీ, డీడీలు తీసిన వారికి తక్షణమే పంపిణీ చేయాలనీ, యువతకు గొర్రెల ఫామ్స్, మేతకు భూములు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 50ఏండ్లు దాటిన గొర్రెల కాపరులకు నెలకు రూ.3000 పెన్షన్ ఇవ్వాల ని కోరారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకుండా ఆదివారం రాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 4,227 మంది గొల్ల కుర్మలను అక్రమ అరెస్టులు చేయడా న్ని ఖండించారు. ప్రభుత్వం రెండేండ్లలో రాష్ట్రంలోని గొల్ల కురుమలందరికీ గొర్రెలు పంపిణీ చేస్తుందని ప్రకటించి 7,29,067 మందిని లబ్ధిదారులను ఎంపిక చేసినట్టు తెలిపారు. మూడేండ్లలో కేవలం 3,65,682 మందికి మాత్రమే పంపిణీ చేశారన్నారు. గొర్రెలు వస్తాయనే ఆశతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 28 వేల మంది గొల్ల కురుమలు అప్పులు చేసి డీడీలు తీసి రెండేండ్లుగా వేచి చూస్తున్నారని చెప్పారు. ఎన్నికల ముందు హడావుడి చేసిన సర్కారు ప్రస్తుతం ఆ పథకాన్ని నిలిపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆచరణలో మాత్రం పంపిణీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ అయిన వారిలో రాష్ట్ర నాయకులు మేకల నాగేశ్వరరావు, బొల్లం అశోక్, సాదం రమేష్, కాడబోయిన లింగయ్య, కె నాగరాజు, ఆలేటి యాదగిరి, సకినాల మల్లయ్య, చేవూరి ఓదెలు, కావటి యాద గిరి, శాతవేని రమేష్, కాట్రావుల తిరుపతి, వివిధ జిల్లాల నాయకులున్నారు.
వారి డిమాండ్లు పరిష్కరించాలి : తమ్మినేని
తమ సమస్యల పరిష్కారం కోసం ప్రగతిభవన్కు వెళ్లిన గొర్రెలు, మేకల పెంపకందార్లను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారనీ, వారిని తక్షణం విడుదల చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. గొర్రెల పంపిణీ కోసం ఏడులక్షల మంది లబ్దిదారుల్ని ఎంపికచేసి మూడేండ్లు అయినా, సగం మందికి కూడా గొర్రెలు ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.