Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ క్రాస్రోడ్స్ వద్ద వామపక్ష విద్యార్థి సంఘాల నిరసన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐడీఎస్వో, పీడీఎస్యూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం ఆర్టీసీ క్రాస్రోడ్స్ వద్ద జెండాలు, ఫ్లకార్డులు చేతబూని భౌతిక దూరం పాటిస్తూ నిరసన నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు చేపట్టిన కార్యక్రమంలో రాష్ట్ర సాంకేతిక విద్యామండలి అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎస్బీటీఈటీ కమిషనర్ దిష్టి బొమ్మనుదహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలిటెక్నిక్ మొదటి, రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులను బీటెక్ డిగ్రీ విద్యార్థుల మాదిరిగానే ప్రమోట్ చేయాలని కోరారు. డిప్లొమా ఫైనలియర్ సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఫలితాలు వెలువడిన తర్వాతనే ఈసెట్ రెండవ విడత కౌన్సెలింగ్ నిర్వహించాలనీ, పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు హాస్టల్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్.మూర్తి,టి.నాగరాజు, ఏఐఎస్ఎఫ్ నాయకులు రవి, పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి రాము, నాయకులు నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు.