Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏసీబీ అధికారులకు అదనపు కలెక్టరు దబాయింపు
- విచారణలో నగేష్ మరిన్ని అక్రమాలు వెలుగులోకి..
- రెండో రోజు విచారణలో తెరపైకి మరో ముగ్గురు బినామీలు
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
కోటికి పైగా లంచం కేసులో విచారణను ఎదుర్కొంటున్న మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ రెండవ రోజు విచారణలోనూ ఏసీబీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మౌనం వహిస్తున్నారని తెలిసింది. తాను చెప్పదలుచుకున్నది మాత్రమే చెప్పి మిగతా ప్రశ్నలకు మిన్నకుండిపోతున్నారని విశ్వసనీయంగా తెలిసింది. కాగా కోటి రూపాయలకు పైగా లంచం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని నగేష్ పదే పదే చెబుతున్నట్టు తెలిసింది.
తనకు త్వరలోనే ఐఏఎస్ గా పదోన్నతి రానున్నదని ఈ పరిస్థితిలో తాను ఇలాంటి చర్యలకు పాల్పడతానా? అని ఆయన ఏసీబీ అధికారులను దబాయించినట్టు సమాచారం. అలాంటప్పుడు మీ నివాసంలో లింగమూర్తికి చెందిన ఏడు చెక్కులు ఎలా దొరికాయని ఏసీబీ అధికారులు వేసిన ప్రశ్నకు తనకు తెలియదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారని తెలిసింది.
దీంతో ఆయనకు లింగమూర్తితో లంచానికి సంబంధించి సాగిన మాటల ఫోన్ రికార్డును ఏసీబీ అధికారులు వినిపించడంతో మౌనం వహించాడని తెలిసింది. లింగమూర్తి , నగేష్ల మధ్య 113 ఎ కరాలకు ఎన్ఓసి ఇవ్వడానికి సంబంధించిన ఫైళ్లు ఆ సందర్భంగా వారిద్దరి మధ్య డబ్బుల డిమాండ్ పైనా రికార్డు చేసిన కన్వర్జన్ను సైతం ఏసీబీ అధికారులు నగేష్ ఎదుట ఉంచి ప్రశ్నించినట్టు సమాచారం. కాగా తాజాగా మరో ముగ్గురు బినామీలను ఏసీబీ అధికారులు కనిపెట్టి వారిని విచారించారు. ఇందులో ఒక మహిళ కూడా ఉందని తెలిసింది. అలాగే మరి కొందరు సాక్షులు, బినామీలను బుధవారం విచారించనున్నారని సమాచారం. మరో వైపు నగేష్ భార్య పేరిట వివిధ బ్యాంకులలో ఉన్న లాకర్లను తెరవడానికి ఏసీబీ అధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
ఇందులో భాగంగా ఆ లాకర్లకు చెందిన డూప్లికేట్ కీ లను తయారు చేయించాలని సదరు బ్యాంకు అధికారులను ఏసీబీ అధికారులు కోరినట్టు తెలిసింది. అలాగే మెదక్, మేడ్చల్, మనోహరబాద్ లలో నగేష్కు సంబంధించి మరిన్ని అక్రమాల సమాచారం తాజాగా ఏసీబీకి లభించినట్టు తెలిసింది.