Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి కుటుంబానికి రూ 10వేలివ్వాలి :టీఎంకేఎంకేఎస్ ఆన్లైన్ సభలో చెరుపల్లి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కరోనా సమయంలో మత్స్యకారులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు కరోనా, మరోవైపు భారీ వర్షాలకు చేప వృత్తిదారులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం 18 రకాల వస్తువులను ఇచ్చి మత్స్యకారులను ఆదుకున్నదనీ, టీఆర్ఎస్ ప్రభుత్వం రూ 1500 ఇచ్చి చేతులుదులుపుకున్నదని చెప్పారు. బడ్జెట్ కేటాయింపుల్లో మత్స్యకారులు తమ వాటా కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మంగళ వారం తెలంగాణ మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం (టీఎంకేఎంకేఎస్) అధ్యర్యంలో 'కరోనా కష్టాల్లో మత్స్య కారులు-ఆదుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు' అనే అంశంపై సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ అధ్యక్షతన ఆన్లైన్ బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని పలు దఫాలుగా ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదని విమర్శించారు. కరోనా సమయంలో ప్రతి కుటుంబానికి రూ 10 వేలు ఇవ్వాలనీ, నిత్యావసర వస్తువుల అందించాలనీ, ప్రతి సొసైటీకి లక్ష సాయం చేయాలని అడిగినా పట్టించుకో వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవృత్తిపై దాదాపు 10 నుంచి 12 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. ఎగుమతులు ద్వారా ప్రభుత్వాలకు వందల కోట్ల ఆదాయ మూ వస్తున్నా... కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారుల సంక్షేమాన్ని గాలికొదిలేశాయన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాలమల్లేష్, కె శంకర్ మాట్లాడుతూ చేపల సబ్సిడీ, సంక్షేమం పేరిట రాష్ట్ర ప్రభుత్వం పెద్ద కుంభకోణానికి పాల్పడుతున్నదని ఆరోపించారు. టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చకు వస్తాయని భావించామనీ, కానీ ప్రభుత్వం తనకు కావాల్సిన బిల్లులను ఆమోదింపజేసుకుని సభను వాయిదా వేసిందని విమర్శించారు. ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి తాండ్రకుమార్ మాట్లాడుతూ ప్రజాసమస్యలను పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. లెల్లెల బాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో పాలకులు మారుతున్నా... మత్స్యకారుల జీవితాలు మారలేదన్నారు. మత్స్యకారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెబుతున్నా...
వారికి చిల్లిగవ్వకుండా అందలేదన్నారు. ఈ సభలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు మటక కుమారస్వామి, మాజీ రాష్ట్ర కార్యదర్శి గొరెంకల నర్సింహ్మ, రాష్ట్ర నాయకులు శ్రీరాములు, ముఠా విజయకుమార్, మురారి మోహన్, కొప్పు పద్మ, చలమోని శంకర్, నాగమణి, రమేష్ మాట్లాడారు.