Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనాతో ఆర్థికంగా చితికిపోయారు
- ప్రభుత్వమే ఆదుకోవాలి
- ఓలా, ఉబర్, ఫైనాన్సర్ల దోపిడీని అడ్డుకోవాలి
- ట్రాన్స్పోర్టు రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
- ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్, సీఐటీయూ, టీఆర్సీపీటీయూ ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ-సిటీబ్యూరో
కరోనాతో ఆర్థికంగా చితికిపోయిన ట్రాన్స్పోర్టు రంగ డ్రైవర్లు అన్లాక్ సీజన్లోనూ ఆదాయాల్లేక, కుటుంబాలను పోషించుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారని సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ అధ్యక్షులు కె.ఈశ్వర్రావు అన్నారు. వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఆల్ ఇండియా రోడ్డు ట్రాన్స్పోర్టు వర్కర్స్ ఫెడరేషన్, సీఐటీయూ, టీఆర్సీపీటీయూ ఆధ్వర్యంలో రవాణా రంగ కార్మికుల సమస్యలు షరిష్కారించాలని డిమాండ్ చేస్తూ 'చలో ఇందిరాపార్కు' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో ఓలా, ఉబర్ కంపెనీలు 28 నుంచి 30శాతం కమీషన్లు దండుకుంటూ డ్రైవర్లను దోపిడీ చేస్తున్నాయని, ఆ కమీషన్ 5శాతానికి తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ట్రాలీ, డీసీఎం డ్రైవర్లు కిరాయిలు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం రవాణా రంగ కార్మికులకు నెలకు రూ.7500 చొప్పున ఆర్థిక సహాయంతో పాటు, ప్రతి కుటుంబానికీ బియ్యం, సరుకులను ఏడాదిపాటు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రయివేటు ఫైనాన్సర్ల వేధింపులకు అడ్డుకట్ట వేయాలన్నారు. రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్పందించి ట్రాన్స్పోర్టు రంగంలోని ట్రేడ్ యూనియన్స్తో జాయింట్ సమావేశం ఏర్పాటు చేసి కార్మికులను ఆదుకోవాలని కోరారు. లేకుంటే కార్మికులు వాహనాలతో రోడ్లపైకి రావడంతో పాటు 'చలో గవర్నర్'(రాజ్భవన్) ముట్డడి చేపడుతారని హెచ్చరించారు.
ఆల్ ఇండియా రోడ్డు ట్రాన్స్పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.శ్రీకాంత్ మాట్లాడుతూ.. లాక్డౌన్ సమయంలో రవాణా రంగ కార్మికులు మూడు నెలలు ఇండ్లకే పరిమితం కావడంతో పనులు లేక ఆకలి చావులకు గురవుతున్నారన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో కార్లు ఉన్నాయని అర్హులైన డ్రైవర్లకు తెల్లరేషన్ కార్డు తొలగించడంతో లాక్డౌన్ కాలంలో లక్షలాది మంది ప్రభుత్వ సహాయానికి దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్ల ప్రాముఖ్యతను గుర్తించి.. వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ.పది లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ సిటీ కార్యదర్శి కె.అజరుబాబు, టీఆర్సీపీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ మాట్లాడుతూ.. ఈఎంఐలపై ఏడాది పాటు వడ్డీలేని మారిటోరియం విధించాలన్నారు. సెట్వీన్ బస్ సర్వీస్ను వెంటనే ప్రారంభించాలని కోరారు. చలాన్లను ఉపసంహరించాలని, రోడ్ టాక్స్లను మరో ఆరు నెలల పాటు వసూలు చేయొద్దని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నగర నాయకులు డీఎల్ మోహన్, ఆర్.మల్లేష్, ఎం.సత్యనారాయణ, కె.రమేష్, ఆటో యూనియన్ జనరల్ సెక్రటరీ ఆసిఫ్, ఉపాధ్యక్షులు అలీ, కలీం, నబీ, మక్బుల్, టీఆర్సీపీటీయూ నాయకులు సోమాజీ పాల్గొన్నారు.
వరంగల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా
వరంగల్ కలెక్టరేట్ ఎదుట రవాణా రంగ కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుతూ సీఐటీయూ వరంగల్ జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. భూపాలపల్లి జిల్లాలోని అంబేద్కర్ సెంటర్లోనూ ధర్నా చేశారు.