Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్లకు బానిసలుగా చేసే యత్నం
- గిట్టుబాటు ధరకు చట్టభద్రత కల్పించాలి
- ఏఐకేఎస్సీసీ ధర్నాలో పలువురు వక్తలు
- ఆయకార్ భవన్ ఎదుట వందలాది మంది ధర్నా
- వామపక్ష పార్టీల నేతల మద్దతు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు ఉరితాళ్ల లాంటివని పలువురు నేతలు విమర్శించారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం రైతులను బిచ్చగాళ్లుగా, బానిసలుగా మార్చే కుట్రకు మోడీ సర్కారు పూనుకున్నదన్నారు. ఆ మూడు చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని ఆయకార్ భవన్(జీఎస్టీ భవన్) ఎదుట అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ (ఏఐకేఎస్సీసీ) ఆధ్వర్యంలో రైతు సంఘాలు ధర్నా చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ నినాదాలు చేశారు. వ్యవసాయ బిల్లుల వల్ల జరుగబోయే నష్టాల గురించి ప్లకార్డులను ప్రదర్శించారు. మోడీ సర్కారును గాడిదతో పోలుస్తూ నిరసన తెలిపారు. ఈ ఆందోళనకు వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు సంఘీభావం తెలిపాయి. ఏఐకేఎస్సీసీ రాష్ట్ర కన్వీనర్లు టి.సాగర్, పశ్యపద్మ, జేవీ చలపతిరావు, ఉపేందర్రెడ్డి, కొండల్ అధ్యక్షతన జరిగిన నిరసన సభలో పలువురు వక్తలు మాట్లాడారు.
కేరళలో ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానం : జూలకంటి రంగారెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
వ్యవసాయ రంగంలో కార్పొరేట్ శక్తులకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటూ వారి ఏజెంట్గా మోడీ వ్యవహరిస్తున్నారు. ఈ చట్టాలు చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, హమాలీ కార్మికుల పొట్టలు గొట్టేలా ఉన్నాయి. దేశానికే ఆదర్శనీయంగా నిలిచేలా కేరళలోని వామపక్ష ప్రభుత్వం ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాన్ని తెచ్చింది. దానివల్ల రైతులకు, వ్యవసాయ కూలీలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. తాము రైతుల పక్షమని కేరళ ప్రభుత్వం నిరూపించింది. కరోనా సమయంలో మోడీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ బంగారు పల్లెంలో పెట్టి కార్పొరేట్లకు కట్టబెడుతున్నది.
87 శాతం చిన్న, సన్నకారు రైతుల భవిష్యత్ ప్రమాదకరం : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి అన్నం పెట్టే రైతు నోట్లో సున్నం కొడుతున్నది. ఈ చట్టాల వల్ల దేశంలోని 87 శాతం చిన్న, సన్నకారు రైతుల భవిష్యత్కు ప్రమాదం పొంచి ఉంది. కొత్త చట్టాలు రైతులను, వినియోగదారులను కార్పొరేట్లు నిలువు దోపిడీ చేయడానికే. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బలమైన ఉద్యమాలు నిర్మించాలి.
ఫ్రీ మార్కెట్తో రైతులకు తీవ్ర నష్టం : టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్
ఫ్రీ మార్కెట్ విధానం వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగనున్నది. కార్పొరేట్ కంపెనీలకు స్వేచ్చ దొరుకుతుంది.Û ఇలాంటి చట్టాలు కాకుండా తక్కువ పెట్టుబడితో రైతులకు ఎక్కువ లాభాలు చేకూరే, మార్కెట్ దోపిడీ విముక్తి చేసే చట్టాలు తెస్తే బాగుండేది. చిన్న, సన్నకారు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలను దృష్టిలో పెట్టుకుని ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలి.
అబద్ధాల పోటీలు పెడితే మోడీకే ఫస్ట్ ప్రైజ్ : ఏఐకేఎస్సీసీ నేత వేములపల్లి వెంకట్రామయ్య
రైతులకు కొత్త చట్టాల వల్ల అపార ప్రయోజనాలు కలుగుతాయని ప్రధాని మోడీ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. ప్రపంచ అబద్ధాల పోటీలు పెడితే మోడీకే ఫస్ట్ ప్రైజ్ లభిస్తుంది. వ్యవసాయ కమిషన్ కమిటీ సూచనల ప్రకారం మద్దతు ధరలెందుకు నిర్ణయించడంలేదో చెప్పాలి. గోధుమలకు మద్దతు ధర రూ.1850 ప్రకటించగా.. మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్లలో రూ.600 -రూ.800 మించి దక్కట్లేదు. సాగు ఉత్పాదక ఖర్చులు 5.7 శాతం పెరిగిన తర్వాత మద్దతు ధరలు 2.6శాతమే పెంచితే రైతులకు ఎలా ప్రయోజనం కలుగుతుంది? గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పించాలి.
ఎమ్సీపీఐ(యూ) రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర కుమార్ మాట్లాడుతూ అన్నింటికీ సబ్సిడీలు, రాయితీలు, నష్టపరిహారాలిచ్చే పాలకులు రైతుల పంటలు దెబ్బతింటే ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఎస్యూసీఐ రాష్ట్ర నాయకులు మురహరి మాట్లాడుతూ గతంలో ప్రజాందోళనలకు భయపడి పక్కనబెట్టిన అంశాలను కరోనాను అడ్డం పెట్టుకుని బీజేపీ ప్రభుత్వం చట్టాలు మార్చేస్తున్నదని విమర్శించారు. ఏఐకేఎస్సీసీ రాష్ట్ర కన్వీనర్లు టి.సాగర్, పశ్యపద్మ, జేవీ చలపతిరావు, ఉపేందర్రెడ్డి, కొండల్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. రైతు, ప్రజా వ్యతిరేక బిల్లులు రద్దయ్యే వరకు సమరశీల పోరాటాలకు రైతులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, సీపీఐ(ఎం) కేంద్ర కమటీ సభ్యులు చెరుపెల్లి సీతారాములు, జి.నాగయ్య, సీపీఐ జాతీయ నాయకులు అజీజ్పాషా, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు రమ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి, టి.జ్యోతి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జంగారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు, కోశాధికారి వంగూరు రాములు, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోస్, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి, పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు బుర్రి ప్రసాద్, గిరిజనసంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ధర్మానాయక్, శ్రీరాంనాయక్, ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎమ్డీ అబ్బాస్, వృత్తిసంఘాల నాయకులు ఆశయ్య, రవీందర్, సీపీఐ(ఎం) సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్, సీపీఐ నగర కార్యదర్శి ఈటీ నర్సింహ్మ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాంతయ్య, రైతు సంఘం సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొప్పని పద్మ తదితరులు పాల్గొన్నారు.