Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెల్లంపల్లిలో భారీ వర్షం.. హైదరాబాద్లో ఓ మోస్తరు
నవతెలంగాణ-దహెగాం/బెల్లంపల్లి/పెద్దపల్లి
పలు జిల్లాల్లో శుక్రవారం భారీ నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నాలుగ్గంటలపాటు భారీ వర్షం పడగా.. హైదరాబాద్లో ఓ మోస్తరు వాన కురిసింది. ఆసిఫాబాద్-కుమురంభీం జిల్లా దహెగాం మండలంలోని ఇట్యాల గ్రామంలో పిడుగుపాటుతో మహిళా రైతు మృతిచెందింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో నాలుగు గంటల పాటు కురిసిన వర్షానికి వరద నీరు ఇండ్లలోకి చేరింది. మున్సిపల్ కమిషనర్, అధికారులు బస్తీల్లో వరద నీటిని తొలగించడానికి చర్యలు తీసుకున్నారు. కన్నాలబస్తీ, హనుమాన్బస్తీ, బాబుక్యాంపు బస్తీ, బజారు ఏరియాలో కాలనీవాసులు వర్షం నీటితో ఇబ్బందులు పడ్డారు. కన్నాల వంతెనను వరద నీరు ముంచెత్తడంతో రెండు గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
ఆసిఫాబాద్ జిల్లా ఇట్యాల గ్రామానికి చెందిన మహిళా రైతు వశాకె భారతి(40) పత్తి చేనుకు పనికెళ్లగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం వచ్చింది. అదే సమయంలో భారతిపై పిడుగు పడింది. ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందింది.
పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం అల్లూరు గ్రామంలో భారీ వర్షానికి విద్యుత్ వైర్లు తెగి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. రామగిరి మండలం కలవచర్ల గ్రామంలోని రెయిన్బో స్కూల్ పక్కనున్న తాటి చెట్టుపై పిడుగు పడింది. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ఆనంతారం గ్రామంలో రైతు గరిగె మీనయ్యకు చెందిన గేదె పొలం వద్ద పిడుగు పాటుకు గురై మృత్యువాతపడింది. రైతుకు రూ.50వేల నష్టం వాటిళ్లింది.