Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'డబుల్' ఇండ్లకు మరో ఏడాది!
- డిసెంబర్ నాటికి 75,079 ఇండ్లే..
- వచ్చే ఏడాదిలో 24,921 ఇండ్లు పూర్తి
- బల్దియా ఎన్నికల కోసమే హడావుడి
నవతెలంగాణ-సిటీబ్యూరో
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 'డబుల్'ను అస్త్రంగా వాడుకుంటున్న టీఆర్ఎస్కు ఈసారి ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యేలా ఉంది. గత ఎన్నికల్లో ఐడీహెచ్ కాలనీలు నిర్మించి.. గ్రేటర్ వ్యాప్తంగా మరో లక్ష ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చి గట్టెక్కింది. ఈసారి ఆ ఇండ్లనే బూచిగా వాడుకుని ఎన్నికల్లో గట్టెక్కాలని యత్నిస్తోంది. అయితే, డిసెంబర్ నాటికి 85వేల ఇండ్లను పంపిణీ చేస్తామని మంత్రి కేటీఆర్ ఘంటాపథంగా చెబుతున్నా కార్యరూపం దాల్చేలా లేదు. ఒకవేళ పంపిణీ చేయాలనుకుంటే కనీసం నవంబర్ నాటికైనా ఇండ్లను పూర్తి చేయాలి. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. పైపై మెరుగులు దిద్దినా ఇండ్లలోపల పనులేమీ కాలేదు. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం డిసెంబర్లోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అదే జరిగితే కోడ్ అమల్లోకొస్తుంది. దీంతో ఇండ్ల పంపిణీకి బ్రేక్ పడే అవకాశం ఉంది.
ఇండ్లకు సంబంధించి మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్యాదవ్ చెబుతున్న మాటలకు అధికారుల మాటలకు పొంతలేదు. జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష ఇండ్లు పూర్తికావడానికి మరో ఏడాది సమయం పట్టే అవకాశముందని అధికారుల నివేదికలు చెబుతున్నాయి. లబ్దిదారులను గుర్తించాలని మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసినా.. ఇంతవరకు ఎలాంటి ప్రక్రియా ప్రారంభం కాలేదు.
డిసెంబర్ నాటికి...
గత జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఈ పరిధిలో లక్ష ఇండ్లను నిర్మించి పేదలకు ఇస్తామని సర్కార్ హామీ ఇచ్చింది. 111ప్రాంతాల్లో లక్ష ఇండ్లకు సంబంధించిన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వీటిలో ఇప్పటి వరకు ఐదు ప్రాంతాల్లో 632 ఇండ్లు పూర్తికాగా 431 లబ్దిదారులకు అందజేశారు. డిసెంబర్ నాటికి మరో 75,079 ఇండ్ల పనులు పూర్తి కావడానికి అవకాశముందని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. మరో 24,921 ఇండ్లను వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు పూర్తిచేయడానికి అవకాశముందంటున్నారు.
కావాల్సిన నిధులు రూ.4007కోట్లు
లక్ష డబుల్బెడ్ ఇండ్లను నిర్మించడానికి రూ.8,598.58 కోట్లు ఖర్చు అవుతాయని అధికారులు అంచనా వేశారు. తర్వాత స్టీల్, సిమెంట్, ఇతర మెటీరియల్కు పెరిగే రేట్లను దృష్టిలో పెట్టుకుని మరో రూ.500కోట్లను సర్కార్ అదనంగా కేటాయించింది. తాగునీరు, మురుగునీటి వ్యవస్థ, రోడ్లు, కరెంట్, స్కూల్స్, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ఇతర మౌలిక వసతుల కోసం రూ.616కోట్లు కేటాయించింది. మొత్తం రూ.9,714.59 కోట్లకుగాను ఇప్పటి వరకు రూ.5,706.71కోట్లు ఖర్చు చేశారు. అయితే, మిగిలిన ఇండ్లను పూర్తి చేయడానికి రూ.4007కోట్లు అవసరముందని అధికారులు చెబుతున్నారు.
భోజగుట్టలో 1828ఇండ్లకు
దేశంలోనే అతిపెద్ద మురికివాడగా భోజగుట్టకు గుర్తింపు ఉంది. ఇక్కడ 1828 ఇండ్లను నిర్మిస్తామని మూడేండ్ల కిందట పేదల ఇండ్లను కూల్చేశారు. కానీ 250ఇండ్ల నిర్మాణ పనులు మాత్రమే ప్రారంభించి ఏడాది కిందటే ఆపేశారు. దీంతో పేదలు తాత్కాలిక గుడెసెల్లోనూ, కిరాయి ఇండ్లలోనూ ఉండలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి గుడిసెలు దెబ్బతిన్నాయి. భోజగుట్ట ఇండ్లపై మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వాస్తవాలు ప్రకటించాలని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆగిపోయిన ఇండ్ల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని, లేకుంటే జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
కోడ్ వస్తే..
జీహెచ్ఎంసీ ఎన్నికలను డిసెంబర్లోనే నిర్వహించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరోపక్క రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. నోడల్ ఆఫీసర్లనూ నియమించారు. ఈ లోపు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ జరుగుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇండ్లను పంపిణీ చేశాకే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.