Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కులదురహంకార హత్యపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు
- కులాంతర వివాహాలకు రక్షణ చట్టం చేయాలి
నవతెలంగాణ-సిటీబ్యూరో/విలేకరులు
కులదురహంకారంతో హేమంత్ను అత్యంత కిరాతకంగా హత్య చేయించిన లక్ష్మారెడ్డి, యుగేందర్రెడ్డి, మిగతా నిందితులందర్నీ కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్బాబు డిమాండ్ చేశారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా కేవీపీఎస్, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఎదుట కేవీపీఎస్ నగర కార్యదర్శి కొమ్ము విజరుకుమార్ అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో టి.స్కైలాబ్బాబు మాట్లాడారు. రాష్ట్రంలో 47కులదురహంకార హత్యలు జరిగాయన్నారు. నిందితులకు పాలకపక్షం అండగా నిలవడంతోనే ఈ దురాగాతాలు పేట్రేగిపోతు న్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమ వివాహం చేసుకున్న హేమంత్- అవంతి చందానగర్లో ఆదర్శ జీవనం సాగిస్తుండగా.. అది జీర్ణించుకోలేని ఆమె తల్లిదండ్రులు, కుటుంబీకులు కిరాయి గూండాలకు రూ.10లక్షల సుఫారీ ఇచ్చి హేమంత్ను అత్యంత పాశవికంగా చంపించారని అన్నారు. ఇలాంటి ఘటనలను అరికట్టాలంటే కులాంతర వివాహాల చట్టం తప్పకుండా తీసుకురావాలని డిమాండ్ చేశారు. పెత్తందారీ ఆధిపత్యం, అధికారపార్టీ అండదండలు, పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ హత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్.శ్రీరాం నాయక్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుర్రి ప్రసాద్, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎం.విప్లవ్కుమార్ మాట్లాడారు. కులదురహంకార హత్యలను అరికట్టాలనే చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం శోచనీయమన్నారు. ప్రణరు హత్య తరహాలోనే హేమంత్ హత్య జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి(పీఎన్ఎం) రాష్ట్ర నాయకులు కోట రమేష్, కేవీపీఎస్ నాయకులు జి.రాములు, హైదరాబాద్ జిందాబాద్ నాయకులు కె.వీరయ్య, నగేష్, రానా తదితరులు పాల్గొన్నారు.
కేవీపీఎస్, దళిత సంఘాల ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా జోగిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల అంబేద్కర్ కూడలిలో నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ, కేవీపీఎస్ ఆధ్వర్యంలో గద్వాల పట్టణంలోని పాతబస్టాండు చౌరస్తాలో నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.
ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, ఖమ్మం పట్టణంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కొత్తబస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట కేవీపీఎస్, వ్యకాస, సీఐటీయూ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో ఆందోళన చేశారు.
హేమంత్ను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్లో కేవీపీఎస్, ఎస్ఎఫ్ఐ, టీఏజీఎస్, టీఏవీఎస్, సీఐటీయూ ఆధ్వర్యంలో ప్లకార్డుల పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ, నర్సింహుల పేట మండలాల్లోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి.