Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్లో రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. కాలనీలు, రోడ్లు నీటమునిగాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 2సెం.మీ వర్షం కురిస్తేనే తట్టుకునే డ్రెయినేజీ వ్యవస్థ మాత్రమే ఉంది. అయితే, శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు 7సెం.మీ వర్షం కురిసింది. పటాన్చెరు, మాదాపూర్, కేపీహెచ్బీ కాలనీ, గచ్చిబౌలి, ఖాజాగుడ, హఫీజ్పేట, అల్వీన్కాలనీ, హైదర్నగర్, మియాపూర్, వెంగల్రావునగర్, బాలానగర్, కాప్రా, మచ్చబొల్లారం, చందానగర్, బాలాజినగర్, కూకట్పల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సికింద్రాబాద్, బేగంపేట్, సరూర్నగర్, ఎల్బీనగర్, హయత్నగర్, హస్తినాపురం, వనస్థలిపురం, మీర్పేట్, బడంగ్పేట్, బోడుప్పల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బేగంపేట్ డివిజన్లోని బ్రాహ్మాణవాడిలో వర్షం కురిసిన ప్రతిసారీ ఇండ్లలోకి నీరు చేరుతుంది. ఈ ప్రాంతంలో ఏండ్ల తరబడి వర్షపునీటి సమస్య పరిష్కారం కావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పైడివిజన్ల నుంచి వచ్చే నీరు హయత్నగర్ డివిజన్లోని శారదానగర్ కాలనీలోకి చేరడంతో కాలనీ పూర్తిగా మునిగింది. మోకాళ్ల లోతు నీటిలో కాలనీ వాసులు బయటకు రాలేని పరిస్థితి. సరూర్నగర్లో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. బేగంపేట్ డివిజన్లోని చికోటి గార్డెన్స్ ప్రాంతంలో నడుముల్లోతు నీళ్లు నిలిచాయి. బేగంపేటలోని హోలీ ట్రినిటీ చర్చ్ నీట మునిగింది. కూకట్పల్లి డివిజన్లోని పాపారాయుడు నగర్ నుంచి జగద్గిరిగుట్ట వెళ్లే రహదారి మొత్తం జలమయమైంది. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రశాంత్నగర్లో వర్షపు నీరంతా ఇండ్లలోకి చేరింది. బోడుప్పల్, ఫీర్జాదిగుడ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోనూ లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.
1037 ఫిర్యాదులు
వర్షాల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్లో ఈనెల 16 నుంచి శనివారం వర కు 1037 ఫిర్యాదులు వచ్చాయి. కాల్సెంటర్ ద్వారా 346, డయల్100 ద్వారా 159, మైజీహెచ్ఎంసీ యాప్ ద్వారా 475, వెబ్సైట్ ద్వారా 57 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో వర్షం కారణంగా నీళ్లు నిల్వడంతో 497ఫిర్యాదులు వచ్చాయి. రోడ్లపై గుంతలను పూడ్చాలని 323ఫిర్యాదులు వచ్చాయి. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా జీహెచ్ఎంసీ అధికారులు స్పందించడం లేదని, రోడ్లపై గుంతలతో వాహనాలను నడపలేని పరిస్థితి ఏర్పడిందని వాహనదారులు వాపోతున్నారు.