Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భగత్సింగ్ జయంతి సభలో నేతలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసి, బడా కార్పొరేట్లకు ధారాదత్తం చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేశారు. భగత్సింగ్ 113వ జయంతి కార్యక్రమాన్ని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యలో హైదరాబాద్లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్సింగ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి చెందిన అమెరికా నుంచి మొదలుకొని పాకిస్తాన్ లాంటి పేద దేశాలు సైతం రైతులకు రాయితీలు ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతుల రాయితీలను, హక్కులను కాలరాసే చీకటి చట్టాలను తెచ్చిందని విమర్శించారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి బి.వెంకట్ మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ, చిన్న సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద కంపెనీలు వ్యవసాయ రంగంలోకి అడుగు పెడితే చిన్న సన్నకారు రైతులు తమ పొలాల్లో తామే కూలీలుగా మారిపోతారని చెప్పారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ మాటల్లో దేశ భక్తిని, ఆచరణలో సామ్రాజ్యవాదులకు సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నదని విమర్శించారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహిరించుకునే వరకు భగత్సింగ్ స్పూర్తితో పోరాటం చేయనున్నట్టు తెలిపారు. అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ చట్టాలకు నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని వివరించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు మాట్లాడుతూ ఈ చట్టాల వల్ల రైతులతో పాటు వ్యవసాయ కార్మికులు తీవ్రంగా నష్ట పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం కార్యదర్శి మూడ్ శోభన్, వ్యవసాయకార్మిక సంఘం ఉపాధ్యక్షురాలు పద్మ తదితరులు పాల్గొన్నారు.