Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్యాస్ కట్టర్తో ధ్వంసం
- రూ.15 లక్షలు లూటీ
- ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీం
నవతెలంగాణ -జడ్చర్ల
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలో ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. సిగల్ గడ్డ రోడ్లో గుబ్బ విశ్వనాథం పెట్రోల్ బంకుకు ఆనుకుని ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. దాదాపు రూ.15లక్షల మేరకు దుండగులు దోచుకెళ్లారు.
సోమవారం అర్ధరాత్రి తర్వాత చోరీ జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అగంతకులు ఒక ముఠాగా వచ్చి ఉండొచ్చని, అయితే, అందులో ఒకరు ఏటీఎంలోకి చొరబడి షట్టర్ మూసేసి గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎంను ధ్వంసం చేసి నగదును దోచుకెళ్లినట్టు పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. బ్యాంకు మేనేజర్ దీపిక అందించిన సమాచారం మేరకు డీఎస్పీ శ్రీధర్, సీఐ వీరస్వామి, ఎస్ఐ షంషుద్దీన్ క్లూస్ టీంను, డాగ్ స్క్వాడ్ను అక్కడికి రప్పించి ఆధారాలు సేకరించారు. పూర్తిస్థాయిలో విచారించి నిందితులను వీలైనంత తొందరలో పట్టుకుంటామని డీఎస్పీ శ్రీధర్ తెలిపారు.
రెండు నెలల కిందట బాదేపల్లి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న ఏటీఎంలో చోరీ యత్నం జరిగింది. అప్పుడు కూడా స్థానికుల సమాచారం మేరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి విచారణ చేపట్టారు. ఇదే విషయమై ఎస్బీఐ శాఖ సెక్యూరిటీ అధికారి సుధాకర్ బాబును వివరణ కోరగా, నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లోనే తమ ఏటీఎంలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు లా అండ్ ఆర్డర్ను పరిరక్షించే బాధ్యత పోలీసులదే తప్ప తమకు ఎలాంటి సంబంధమూ ఉండదని, సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయాలన్న నిబంధనలు తమకు లేవని చెప్పడం గమనార్హం. ఇదిలా ఉండగా బ్యాంకర్ల నిర్లక్ష్య ధోరణిపై ఒక ఖాతాదారునిగా పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు స్థానిక నాయకుడు పాలది రామ్మోహన్ తెలిపారు.