Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగుశాతానికి పాజిటివ్ రేటు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా తగ్గుముఖం పడుతున్నది. రాష్ట్రంలో ప్రజలను భయాందోళనకు గురి చేసిన కొవిడ్-19 ప్రభావం క్రమక్రమంగా తగ్గుతోంది. మంగళవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మార్చి నుంచి జూన్ వరకు పెరుగుతూ వచ్చింది. మార్చిలో తొమ్మిది శాతం, ఏప్రిల్ లో ఐదు శాతం, మేలో 15 శాతం, జూన్ నెలలో 23 శాతం నమోదయింది. జులైలో అది కాస్తా 13 శాతానికి పడిపోయి ఆగస్టు నాటికి ఏడు శాతం, సెప్టెంబర్లో నాలుగు శాతం దగ్గర ఆగింది. పరీక్షిస్తున్న నమూనాల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నది. మార్చిలో కేవలం 1087 నమూనాలను పరీక్షించగా సెప్టెంబర్ లో 15,16,796 చేశారు. ప్రభుత్వాస్పత్రుల బెడ్లలో 25.40 శాతం రోగులుండగా, ప్రయివేటు ఆస్పత్రుల్లో 34.56 శాతంగా నమోదైంది. కరోనా బాధితుల్లో పురుషులు 61.28 శాతముండగా మహిళలు 38.72 ఉండటం గమనార్హం.
జీహెచ్ఎంసీలో ఎక్కువ...నారాయణపేటలో తక్కువ
రాష్ట్రంలో ప్రస్తుతం 29,477 మంది కరోనా రోగులుండగా, అందులో జీహెచ్ఎంసీలోనే అత్యధికంగా 4026 మందిని గుర్తించారు.అతి తక్కువగా నారాయణపేటలో 228 మందికి వైరస్ సోకింది. మిగిలిన జిల్లాల్లో ఆదిలాబాద్ లో 270 మంది రోగులు, భద్రాద్రి కొత్తగూడెం 1209, జగిత్యాల 612, జనగాం 398, జయశంకర్ భూపాలపల్లి 384, జోగులాంబ గద్వాల 299, కామారెడ్డి 626, కరీంనగర్ 1551, ఖమ్మం 1309, కొమురంభీం ఆసిఫాబాద్ 341, మహబూబ్ నగర్ 626, మహబూబాబాద్ 854, మంచిర్యాల 512, మెదక్ 356, మేడ్చల్-మల్కాజిగిరి 2276, ములుగు 327, నల్లగొండ 1978, నారాయణపేట్ 228, నిర్మల్ 370, నిజామాబాద్ 1024, పెద్దపల్లి 697, రాజన్న సిరిసిల్ల 754, రంగారెడ్డి 2291, సంగారెడ్డి 455, సిద్ధిపేట 1110, సూర్యాపేట 1024, వికారాబాద్ 242, వనపర్తి 583, వరంగల్ రూరల్ 469, వరంగల్ అర్బన్ 1209, యాదాద్రి-భువనగిరి 583 ఉన్నాయి.
అంచనా కరక్టే : ఈటల రాజేందర్
కరోనా క్రమక్రమంగా తగ్గుతుందని వైద్యారోగ్యశాఖ ముందే అంచనా వేసిందో అదే పరిస్థితి నేడు రాష్ట్రంలో నెలకొన్నదని ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో పూర్తి స్థాయిలో నియంత్రణ కోసం కషి చేయాలని ఆదేశించారు. ప్రజలు జాగ్రత్తలను యధావిధిగా తీసుకోవాలని సూచించారు. కరోనా తగ్గుముఖం పట్టిందని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు మీడియా సమావేశంలో వెల్లడించారు.