Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ధరణి వెబ్సైట్ కోసం ప్రజల ఆస్తుల సమాచారాన్ని సేకరించేందుకు ముందస్తు సమాచారం ఇచ్చి సర్వే చేపట్టాలనీ, డాక్యుమెంట్లు చూపెట్టడానికి నిర్ధిష్ట సమయమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 15 రోజుల్లో సేకరించాలని సీఎం ఆదేశించారని చెబుతూ ఏయే డాక్యుమెంట్లు కావాలో సమాచారం ఇవ్వకుండానే అధికారులు వివరాల సేకరణకు వెళ్లడం సరిగాదని పేర్కొన్నారు. వాళ్లు అడిగే ప్రశ్నలు, సంబంధిత పత్రాల పట్ల ప్రజల్లో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయనీ, దీంతో వారు భయభ్రాంతులకు గురవుతూ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం రెవెన్యూ కోర్టులలో పెండింగులో ఉన్న 16,163 కేసులను 10 ట్రిబ్యునళ్ల ద్వారా వచ్చే నాలుగు నెలల్లో పరిష్కారం చేస్తామని చెప్పారనీ, అవి పరిష్కారం కాకుండా ధరణి వెబ్సైట్లో నమోదు చేయటానికి సాగుభూములు, సాగేతర ఆస్తుల సమాచారం సేకరణ 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించడం సరిగాదని తెలిపారు. ఆస్తుల వివరాలను గ్రామపం చాయతీ, మున్సిపాల్టీలలో బహిరంగ ప్రకటనకు పెట్టి, 15 రోజుల గడువు పెట్టి అభ్యంతరాలను సేకరించాలనీ, అభ్యంతరాలు పరిష్కరించిన తర్వాతే సాగు, సాగేతర భూముల సమాచారాన్ని ధరణి వెబ్సైట్లో నమోదు చేయాలని సూచించారు. హడావుడిగా సమాచారం సేకరించడం, వెబ్సైట్లో నమోదు చేయటం వల్ల హక్కుదారులకు అన్యాయం జరిగే ఆస్కారం ఉందని హెచ్చరించారు. ఇప్పటికే ప్రభుత్వం వద్ద సాదా బైనామాల పేరుతో 10,96,344 దరఖాస్తులు, 2,65,653 పాసుపుస్త కాలలో తప్పులు నమోదైనట్టు తేలిందనీ, వాటికి పట్టా హక్కు కల్పిస్తూ ధరణిలో నమోదు చేయాలని కోరారు. హడావుడిగా చేస్తే మళ్లీ తప్పిదాలు దొర్లే అవకాశం ఉందనీ, అలా కాకుండా తగు సమయమిచ్చి వివరాలను సమగ్రంగా సేకరించి ధరణి వెబ్సైట్ను రూపొందించాలని సూచించారు.