Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారి భూములకు కొత్త పాసుపుస్తకాలు ఇవ్వాలి
- లేకుంటే కలెక్టరేట్ను ముట్టడిస్తాం
- రియల్ భూములను దున్నే రోజులొస్తరు..:వ్యకాసా జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
- పట్టా పాస్ పుస్తకాల కోసం పాదయాత్ర
- మోటకొండూరు తహసీల్ ఎదుట ధర్నా
నవతెలంగాణ - భువనగిరి
''దళితులను విస్మరిస్తే ఖబడ్దార్.. భూమిని చదును చేసుకుని 66 ఏండ్లుగా సేద్యం చేస్తున్న దళిత రైతులకు వెంటనే కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలి. లేకపోతే కలెక్టరేట్ను ముట్టడిస్తాం'' అని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం మాటూరు దళిత రైతులకు కొత్త పాస్పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వరకు 10 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రను వెంకట్, సంఘం రాష్ట్ర కార్యదర్శి బి.వెంకట్రాములు ప్రారంభించి పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా బి.వెంకట్ మాట్లాడుతూ.. 66 ఏండ్ల కిందట శివాయజమదారు పట్టా కింద 50 మంది భూమి లేని నిరుపేదలకు నాటి ప్రభుత్వం తోక పట్టాలు ఇచ్చిందని చెప్పారు. తిరిగి టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు మరో రెండుసార్లు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేశాయని వివరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో భూరికార్డుల ప్రక్షాళన అనంతరం రైతులకు కొత్త పాసు పుస్తకాలు ఇస్తామని చెప్పడంతోనే సమస్య వచ్చిందన్నారు. వారి భూములు చెరువు శిఖం కింద ఉన్నాయని అధికారులు పాసుపుస్తకాలు ఇవ్వలేదన్నారు. గ్రామ చెరువు రైతుల భూములకు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉందని, అలాంటప్పుడు ఆ భూములు చెరువు శిఖం ఎలా అవుతాయని ప్రశ్నించారు. ధరణి పోర్టర్ వచ్చేలోపు రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శిఖం పేరుతో దళితుల భూములు గుంజుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పజెప్పే కుట్రలు సాగుతున్నాయని, కానీ, రియల్ ఎస్టేట్ భూములనే రైతులు దున్నుకొని సేద్యం చేసే పరిస్థితి త్వరలోనే వస్తుందని చెప్పారు. వ్యకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు మాట్లాడుతూ.. మాటూరు దళిత రైతుల పేర్లు చెరువు శిఖం భూముల్లోకి ఎలా వచ్చాయని అధికారులను ప్రశ్నించారు. దళితుల భూములు రోడ్డుకిరువైపులా ఉండటంతో వాటి ధర రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు పలుకుతున్నాయని, అందువల్లే కుట్ర పూరితంగా శిఖం భూములంటూ సమస్య సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఈ సమస్యపై ఎందుకు కలిసి రావడం లేదని రైతులు వారిని ప్రశ్నించాలన్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ మాదాసు సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యకాస జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వేముల మహేందర్, కొండమడుగు నర్సింహా, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్పంగి స్వామి, నాయకులు జల్లెల పెంటయ్య, బోలగాని జయరాములు, కల్లూరి అంజయ్య, జూకంటి పౌల్, పల్లెర్ల అంజయ్య, మాటూరి సర్పంచ్ యాదయ్య పాల్గొన్నారు.